ఆరోగ్యానికి సెల్లు చీటి | Bacteria spread by cell phone | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి సెల్లు చీటి

Feb 10 2014 12:57 AM | Updated on Aug 21 2018 5:16 PM

సెల్‌లో హలో అంటూ పలకరిస్తున్నారా.. హాయ్ అంటూ సంక్షిప్త సందేశం పంపిస్తున్నారా? అంతవరకు అయితే ఫరవాలేదు. అదేపనిగా సెల్‌ఫోన్ వాడితే అనర్ధాలే అంటున్నారు

 సెల్‌లో హలో అంటూ పలకరిస్తున్నారా.. హాయ్ అంటూ సంక్షిప్త సందేశం పంపిస్తున్నారా? అంతవరకు అయితే ఫరవాలేదు. అదేపనిగా సెల్‌ఫోన్ వాడితే అనర్ధాలే అంటున్నారు వైద్య నిపుణులు. సెల్‌ఫోన్ల వలన ఎంత మేలు జరుగుతుందో.. అంతకు మించిన కీడు ఉందని హెచ్చరిస్తున్నారు. మనిషి నిత్యం వెంటపెట్టుకుని తిరిగే సెల్‌ఫోన్ బాక్టీరియాకు అడ్డాగా మారుతోందంటున్నారు. దీని ద్వారా మనకు తెలియకుండానే చర్మ వ్యాధులు, కేన్సర్, మతిమరుపు, మెదడు, చెవికి సంబంధించిన వ్యాధులు సోకుతున్నాయని చెబుతున్నారు.
 - న్యూస్‌లైన్, గుంటూరు మెడికల్
 
 సె ల్‌ఫోన్ మన జీవితంలో నిత్యావసరంగా మారింది. ఒకప్పుడు దూరప్రాంతాల్లో ఉండేవారితో మాట్లాడేందుకే దీన్ని వినియోగించేవాళ్లం. ఇప్పుడు ఇంటర్‌నెట్ వినియోగం, సెల్‌ఫోన్‌లో వివిధ రకాల ఫీచర్లు పెరిగిపోయాయి. దీంతో జేబులో ఉండి ఎప్పుడో రింగ్ అయ్యే ఫోన్ ప్రస్తుతం చేతుల్లోకి వచ్చింది. చాటింగ్ చేస్తూనో, గూగుల్‌లో సెర్చ్ చేస్తూనో, మ్యూజిక్ వింటూనో.. నిత్యం ఎంతోమంది ఫోన్‌తో గడిపేస్తున్నారు. ఇందులో పల్లె, పట్నం అనే తేడా లేదు.. సెల్‌ఫోన్ లేకపోతే రోజు గడవని పరిస్థితి నెలకొంది.  ఆయితే సెల్‌ఫోన్ వినియోగంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందంటున్నారు. స్ట్రెప్టోకొకి, స్టాఫిలోకొకి, ఈకోలి అనే బాక్టీరియా, కాంటాక్ట్ డెర్మటిటీస్ అనే స్కిన్ అలర్జీ వ్యాపించే అవకాశాలున్నట్టు హెచ్చరిస్తున్నారు. 
 
 టచ్ స్క్రీన్, కీప్యాడ్‌లపై సూక్ష్మ జీవులు
 టచ్ స్క్రీన్ సెల్‌ఫోన్లు, కీప్యాడ్‌ల వల్ల కూడా ఎన్నో రకాల సూక్ష్మజీవులు వ్యాపిస్తున్నారుు. అవన్నీ కూడా చేతి వేళ్లపైకి, బుగ్గలపైకి చేరే అవకాశం ఉంటుంది. తద్వారా వివిధ రకాల చర్మ సమస్యలు తలెత్తవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. బుగ్గలపై, చెవుల వద్ద బొబ్బర్లు రావడానికి ఈ మొబైల్‌ఫోన్లే కారణమని హెచ్చరిస్తున్నారు. మరీముఖ్యంగా సెల్‌ఫోన్లు అధికంగా చెవి వద్ద పెట్టుకొని గంటల తరబడి మాట్లాడేవారికి వినికిడి మందగించడం, మెదడుకు సంబంధించిన వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఎలక్ట్రో మాగ్నటిక్ వేవ్స్(ఏఈడబ్ల్యూ) ద్వారా శరీర కణజాలం వేడెక్కే ప్రమాదం ఉంటుంది. దీని కారణంగా చర్మంలోని ప్రొటీన్ల నిర్మాణ క్రమం మారిపోయే అవకాశం ఉందని ఇటీవల కాలంలో ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనాల్లో వెల్లడైంది. 
 
 ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఇన్ఫోమేనియా వ్యాధి
 సెల్‌ఫోన్ వినియోగదారుల్లో ఎక్కువమంది కుర్రకారే. వీరంతా అవసరానికి మించి ఫోన్ వినియోగిస్తూ.. రోజంతా అదేపనిగా ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తూ కాలం గడుపుతున్నారు. దీనివల్ల ‘ఇన్ఫోమేనియా’ అనే వ్యాధి బారిన పడుతున్నారు. అలాగే ఇంటర్‌నెట్‌లో ఈ-మెయిల్స్ అదే పనిగా చూడడమూ ఓ అలవాటుగా మారింది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ ఇన్ఫోమేనియా వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. 
 
 అధిక రేడియేషన్... 
  సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్ లేని సమయంలో సరిగా వినిపించి వినిపించకుండా ఉండే సమయాల్లో అధిక రేడియేషన్ విడుదల అవుతుంది. ఎక్కువగా అండర్‌గ్రౌండ్స్‌లో, లిఫ్టుల్లో ఉన్న సమయాల్లో ఫోన్ మాట్లాడితే అధిక రేడియేషన్ బయటకు వస్తుంది. ఇలాంటి సమయాల్లో ఫోన్‌వాడకుండా ఉండటం చాలా ఉత్తమం.
  ప్రస్తుతం సెల్‌ఫోన్‌అధిక సమయం వినియోగించేవారికి ఇప్పటికిప్పుడే దాని ప్రభావం కనిపించదు. ఫోన్‌వాడకం పదిహేనేళ్లు దాటాక సెల్ రేడియేషన్ ప్రభావం తెలుస్తుంది. సెల్‌రేడియేషన్‌కు గురయ్యేవారిలో తలతిరగటం, చెవిలో శబ్ధాలు, మెదడులో కణితులు ఏర్పటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. 
  చిన్నారుల్లో, గర్భిణుల్లో కూడా రేడియేషన్ వల్ల దుష్పరిమాణాలు కలుగుతాయి. షుగర్, బీపీ, గుండెపోటుకు సెల్‌రేడియేషన్ కూడా కారణమే. 
  రేడియేషన్‌ను నివారించేందుకు ‘రేడియేషన్ ప్రివెంటివ్ చిప్‌లు’ సెల్‌ఫోన్‌కు అమర్చాలి. 
  విటమిన్ ‘ఇ’ తో కూడిన మాయిశ్చరైజర్‌ను యాంటీయాక్సిడెంట్స్‌తో కూడిన ఎమోలియెంట్స్‌ను ఉపయోగించాలి. అవి చర్మానికి తేమను అందించడంతోపాటుముడతలు రాకుండా చేస్తాయి. 
   రోజూ రెండు మూడుసార్లు చేతులను, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. గంటల తరబడి మొబైల్‌ను వినియోగించకూడదు.
 
 - డాక్టర్ ఎం.ఆదినారాయణరావు, రేడియాలజిస్ట్
 పలు రకాల చర్మవ్యాధులు
 మొబైల్ ఫోన్‌కు ఉండే నికెల్ కోటింగ్ వల్ల కొన్ని రకాల బాక్టీరియాలు వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో కొందరు ఈ తరహా చర్మవ్యాధులతో బాధపడుతున్నారని స్కిన్ స్పెషలిస్టులు చెప్పారు. నునుపైన బుగ్గలపై నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు సోకే రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ మచ్చలపై దురద వంటి లక్షణాలు ఉంటాయి. మొబైల్‌ను ఎక్కువగా వినియోగించే వ్యక్తుల్లో ఈ తరహా చర్మ సమస్యలు వ్యాపిస్తున్నాయని వైద్యుల పరిశీలనలో వెల్లడైంది.
 
 క్యాన్సర్ వచ్చే అవకాశం..
  సెల్‌ఫోన్‌ను విపరీతంగా వినియోగించటం వల్ల అధికంగా రేడియేషన్ విడుదలై క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.  సెల్‌లు రేడియేషన్ ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రో మాగ్నటిక్‌ఫీల్డును వెలువరిస్తాయి. 
  ఇది క్యాన్సర్ కారకం అని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చి ఆన్ క్యాన్సర్ అనే సంస్థ సర్వే చేసి వెల్లడించింది. 
  టచ్‌స్క్రీన్, కీప్యాడ్ వల్ల కంటికికనిపించని బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి.  - డాక్టర్ ఎం.జి.నాగకిషోర్, క్యాన్సర్ వైద్య నిపుణులు
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement