సోషల్ మీడియా మోజులో యువత
రాత్రికి రాత్రే ఫేమస్ కావాలనే అత్యాశ
ప్రమాదకర స్టంట్లతో ప్రాణాల మీదకు
సాక్షి, సిటీబ్యూరో: సామాజిక మాధ్యమాలకు అతుక్కుపోయిన నగరంలోని కొందరు యువత, ఎలాగైనా సరే అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలని అజాగ్రత్త, నిర్లక్ష్యంగా ప్రమాదకరంగా రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల ఓల్డ్ మల్లాపూర్లో 8వ తరగతి విద్యార్థి (14) బాల్కనీపై స్టంట్స్ చేస్తూ రీల్స్ చిత్రీకరిస్తుండగా పడిపోయి చనిపోవడమే దీనికి నిదర్శనం. మద్యం, గ్యాంబ్లింగ్ మాదిరే రీల్స్కూ యువత బానిసలుగా మారుతున్నారు.
నిరంతరం ఏదో ఒక రూపంలో గుర్తింపు ఉండాలనినే భావనతో పోస్ట్ చేసిన వెంటనే లైక్లు, వ్యూయర్షిప్ రాకపోతే ఒత్తిడికి లోనవుతున్నవారు అనేకం. బైక్లతో స్టంట్లు, ఎత్తు నుంచి దూకుతున్నట్లు వీడియోలు, రైలు వస్తుండగా నిల్చోవడం, ఉరేసుకుంటున్నట్లు నటిస్తూ సెల్ఫీ తీసుకోవడం, అసభ్య పదజాలం వాడడం, అవసరం లేకున్నా అర్ధ నగ్న ప్రదర్శనలు చేయడం ఈ కోవలోకే వస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారో చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని, సామాజిక మాధ్యమాలపై హద్దులు చెప్పాల్సిందేనని సూచిస్తున్నారు.
ఒక్క చాన్స్ చాలు అనే ఆశ..
కంటెంట్ ఎలా ఉన్నా ఒక్క వీడియో వైరల్ అయితే చాలు రాత్రికి రాత్రే స్టార్ అయిపోవచ్చు.. ఫాలోవర్లు పెరిగితే ప్రమోషన్లతో డబ్బూ సంపాదించొచ్చు. అంతకుమించి నలుగురిలో ప్రత్యేకంగా ఉండొచ్చు. ఇలా... కారణమేదైనా ఈ మోజు సరికొత్త నేరాలు, దుష్పరిణామాలకు దారితీస్తోంది. రీల్స్ మాయలో పడుతున్నవారిలో 15– 25 ఏళ్ల లోపు వారు ఎక్కువగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఇలానే తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిలుస్తున్నవారు కొందరైతే... కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నవారు మరికొందరు ఉన్నారని అంటున్నారు.


