అమరావతికి మరో విద్యుత్‌ ప్రాజెక్టు | Another power Project To Amaravati | Sakshi
Sakshi News home page

అమరావతికి మరో విద్యుత్‌ ప్రాజెక్టు

Aug 16 2018 3:36 PM | Updated on Sep 18 2018 8:37 PM

Another power Project To Amaravati - Sakshi

సాక్షి, అమరావతిబ్యూరో: అమరావతి విద్యుత్‌ ప్రాజెక్టుల్లో మరో ముందడుగు పడింది. రాజధాని భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా కేంద్ర ఇంధన శాఖ కొత్తగా ఓ 660కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. దక్షిణ గ్రిడ్‌ను అనుసంధానిస్తూ ఈ సబ్‌స్టేషన్‌ను నిర్మించనున్నారు. ఇప్పటికే కేంద్ర ఇంధనశాఖ రెండు సబ్‌స్టేషన్లను నిర్మాణానికి నిధులు ఇస్తోంది. మరోవైపు ట్రాన్స్‌కో 16 జీఐ సబ్‌స్టేషన్లను దశలవారీగా నిర్మాణానికి ఉపక్రమించింది. తాజాగా కేంద్రం మరో సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి ఆమోదం తెలపడంతో రాజధాని విద్యుత్‌ అవసరాల ప్రణాళికకు సమగ్రత చేకూరినట్లైంది.

పులిచింతల వద్ద 660కేవీ సబ్‌స్టేషన్‌...!
పులిచింతల ప్రాజెక్టు వద్ద జల విద్యుత్‌ కేంద్రం నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించారు. దానికి అనుసంధానంగా ముందుగానే ఓ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మించాలన్న ప్రతిపాదన కొన్నేళ్లుగా పెండింగులో ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో రాజధానిలో విద్యుత్‌ వినియోగం భారీగా పెరుగునుంది. దీంతో పులిచింతల ప్రాజెక్టు వద్ద కొత్తగా 660 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మించాలని కేంద్ర ఇంధన శాఖ నిర్ణయించింది. అక్కడ నుంచి రాజధానికి దాదాపు 60కి.మీ.మేర విద్యుత్‌ లైన్లు వేయాలని ప్రతిపాదించారు. దాదాపు రూ.350 కోట్లతో ఈ సబ్‌స్టేషన్‌ను నిర్మించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ఇంధన శాఖ మాచర్లలో ఒక 440కేవీ సబ్‌స్టేషన్, సత్తెనపల్లిలో 660 కేవీ సబ్‌స్టేషన్లను నిర్మాణ ప్రక్రియ చేపట్టింది. ఆ రెండు సబ్‌స్టేషన్లను ట్రాన్స్‌కో పర్యవేక్షణలో దాదాపు నిర్మించనున్నారు. దక్షిణాది గ్రిడ్‌కు అనుసంధానిస్తూ ఆ రెండు సబ్‌స్టేషన్లు నిర్మిస్తారు.

అమరావతిలో 19 సబ్‌స్టేషన్లు ప్రతిపాదన
కేంద్రం తాజా నిర్ణయంతో అమరావతిలో నిర్మాణానికి నిర్ణయించిన విద్యుత్‌ సబ్‌స్టేషన్లు సంఖ్య 19కు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం రెండు 660కేవీ, ఒక 440 కేవీ సబ్‌స్టేషన్లను నిర్మించనుంది.
ఇక ట్రాన్స్‌కో అమరావతిలో 16 జీఐ సబ్‌స్టేషన్లను దశలవారీగా నిర్మించాలన్న ప్రణాళికకు రూపొందించింది. వాటిలో రెండు సబ్‌స్టేషన్ల నిర్మాణానికి టెండర్లు ప్రక్రియ కూడా పూర్తి చేసింది. మొత్తం సబ్‌స్టేషన్లను దశలవారీగా 2022నాటికి నిర్మాణం పూర్తి చేయాలన్నది ట్రాన్స్‌కో ప్రణాళిక.

Advertisement
 
Advertisement
Advertisement