పశువులకూ 'ఆధార్‌' | Aadhaar for cattle and goats and sheep is Implementation in all districts from 16th | Sakshi
Sakshi News home page

పశువులకూ 'ఆధార్‌'

Feb 15 2020 3:55 AM | Updated on Feb 15 2020 3:55 AM

Aadhaar for cattle and goats and sheep is Implementation in all districts from 16th - Sakshi

సాక్షి, అమరావతి:  మనకు ఆధార్‌ కార్డు ఉన్నట్లే పశువులకూ రాష్ట్ర ప్రభుత్వం ఆ తరహా కార్డులు ఇవ్వనుంది. రాష్ట్రంలోని పశువులు, మేకలు, గొర్రెలకు సర్కారు 12 అంకెల విశిష్ట సంఖ్యను కేటాయించబోతోంది. ఈ సంఖ్యతో పశువుల చెవులకు ప్రత్యేక ట్యాగ్‌ వేస్తారు. దీంతో భవిష్యత్‌లో ట్యాగ్‌ ఉన్న పశువులకే ప్రభుత్వ పథకాలు అందనున్నాయి. అవిలేనివి ప్రమాదంలో చనిపోయినా రైతుకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వరు. రాయితీ పథకాలు కూడా మంజూరు కావు. ఏటా పశుసంవర్థక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయిస్తున్న రూ.వెయ్యి కోట్లలో నాలుగో వంతు నిధులు రాయితీ పథకాలకు ఇస్తోంది.

ఇవి దుర్వినియోగం కాకుండా ఉండేందుకే ‘ఇనాఫ్‌ ట్యాగ్‌’ (ఇన్ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ యానిమల్‌ ప్రొడక్టవిటీ అండ్‌ హెల్త్‌)ను వేయనున్నారు.  ఈ కార్యక్రమానికి పైలట్‌ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లాను గత ఆగస్టులో ఎంపిక చేసింది. ఈనెల 16 నుంచి రాష్ట్రంలోని మిగిలిన 12 జిల్లాల్లోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు వాక్సిన్‌తోపాటు ఇనాఫ్‌ ట్యాగ్‌ను వేయనున్నారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.08 కోట్ల ఆవులు, గేదెలు ఉన్నాయి. రెండు నెలల వ్యవధిలో వీటన్నింటికీ వాక్సిన్‌తోపాటు ట్యాగ్‌లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి రూ.31 కోట్లను కేటాయించింది. ఇందులో రూ.15 కోట్లు ఇనాఫ్‌ ట్యాగ్‌లకు పోగా.. మిగిలిన నిధులను వాక్సిన్‌ కొనుగోలు, వాటిని భద్రపరచడానికి రిఫ్రిజిరేటర్లు, ఇతర పరికరాల కొనుగోలుకు ఖర్చు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement