
బాప్రే... టికెట్ 70 వేలా!
సంక్రాంతి సందడి ముగియడంతో జనం తిరుగు ప్రయాణాలతో విశాఖ విమానాశ్రయం కోలాహలంగా కనిపించింది.
విమాన ధరలకు రెక్కలు
రాకపోకల విమానాలన్నీ ఫుల్
జోరుగా విమాన ప్రయాణాలు
గోపాలపట్నం: సంక్రాంతి సందడి ముగియడంతో జనం తిరుగు ప్రయాణాలతో విశాఖ విమానాశ్రయం కోలాహలంగా కనిపించింది. విమాన చార్జీలు ఠారెత్తించినా ప్రయాణికులు లెక్కచేయలేదు. దేశీయ ప్రయాణికులు, అంతర్జాతీయ ప్రయాణికులూ సమయానికే ప్రాధాన్యం ఇచ్చారు. విమాన చార్జీ ఒక దశలో రూ.70 వేలు పలికినా ప్రయాణికులు వెనక్కి జంకకుండా విమానం ఎక్కేశారు. సాధారణంగా హైదరాబాదుకి రూ.2 వేలకు దొరికేసే విమాన టికెట్ ఆదివారం మాత్రం రూ.17,603 నుంచి 50 వేల వరకూ పలికింది. అలాగే ఐదు వేలలోపు టికెట్ ఉండే ముంబయ్, చెన్నై, బెంగళూరుకి కూడా అదేస్ధాయిలో డిమాండ్ కనిపించింది. ఇక రూ.ఐదు వేల నుంచి పదివేల లోపు టికెట్ ఉండే దిల్లీ ప్రయాణ చార్జీ ఆదివారం రూ.25 వేల నుంచి మొదలై రూ.70 వేలు పలికింది. ఇలా ఠారెత్తిన చార్జీలు సందర్శకులకు ఆశ్చర్యం కలిగించినా ప్రయాణికులు సాధారణంగానే సాగారు.
ఆలస్యంగా విమానాల రాకపోకలు...
విశాఖ విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు రావలసిన ఎయిరిండియా విమానం 9.47కి వచ్చింది. అలాగే దిల్లీ నుంచి విశాఖ రావలసిన మరో ఎయిరిండియా విమాన సర్వీసు సాయంత్రం 5.10కి రావలసి ఉండగా, రాత్రి 7.25కి వచ్చింది. దీంతో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు.