భారీగా రేషన్‌ బియ్యం పట్టివేత

5 Tonnes Of Ration Rice Seized In Nellore - Sakshi

లారీలో ఐదు టన్నులు, ఆటోలో 600 కిలోల బియ్యం

పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు, పోలీసుల విచారణ

సాక్షి, కావలి (నెల్లూరు): పట్టణంలోని మద్దూరుపాడులో టీడీపీ నేత దామిశెట్టి శ్రీనివాసులునాయుడుకు చెందిన రైస్‌మిల్లులో సోమవారం సుమారు 5.6 టన్నుల రేషన్‌ బియ్యం పట్టుబడింది. లారీలో నుంచి రైస్‌మిల్లులో 5 టన్నుల రేషన్‌ బియ్యం దించుతుండగా గుర్తించి పట్టుకున్నారు. ఆ బియ్యంను పౌరసరఫరాలశాఖ, పోలీస్‌ అధికారులు పరిశీలిస్తుండగానే, మరో ఆటోలో రేషన్‌ బియ్యం తీసుకుని మిల్లులోకి వచ్చింది. దాన్ని బయటకు పంపేందుకు శ్రీనివాసులునాయుడు సోదరుడు ప్రయత్నంచగా గమనించిన కావలి రూరల్‌ సీఐ మురళీకృష్ణ, ఎస్సై అరుణకుమారి, ఏఎస్సై తిరుమలరెడ్డి వాటినీ పట్టుకున్నారు.

రేషన్‌ బియ్యం ‘పాలిష్‌’
కావలిలో కొందరు రైస్‌మిల్లుల యజమానులు నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో రేషన్‌ బియ్యాన్ని సేకరించి వాటికి పాలీష్‌ పట్టి బహిరంగ మార్కెట్‌లో దర్జాగా అమ్మకాలు చేసుకొని లాభాలు గడిస్తున్నారు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ తంతుపై అనేక సార్లు పలు మిల్లులపై దాడులు కూడా జరిగాయి. అయినా మిల్లర్లలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తాజాగా టీడీపీ నేత దామిశెట్టి శ్రీనివాసులు నాయుడుకు చెందిన మిల్లులో 5.6 టన్నుల బియ్యం పట్టుబడడం విశేషం.

వేపకాయల మిల్లు కేంద్రంగా..
శ్రీనివాసులునాయుడుకు చెందిన వేపకాయల మిల్లు కేంద్రంగా రేషన్‌ బియ్యం సేకరణ జరుగుతోంది. కావలికి చుట్టు పక్కల మండలాల నుంచి రేషన్‌ బియ్యాన్ని సేకరించేందుకు విస్తృతమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వారు రేషన్‌కార్డు లబ్ధిదారులు దగ్గర, రేషన్‌ డీలర్ల వద్ద సేకరించిన బియ్యాన్ని ఎరువుల బస్తాల్లో వేపకాయల మిల్లు వద్దకు చేరుస్తున్నారు. కేజీకి రూ.15 వంతున వారికి చెల్లిస్తున్నారు. ఇక్కడే స్టాక్‌ పాయింట్‌గా చేసుకొని వారి సొంత లారీలోనే లోడింగ్‌ చేసుకుని మద్దూరుపాడులో ఉన్న రైస్‌మిల్లుకు తరలిస్తుస్తున్నట్లు పౌరసరఫరాల శాఖాధికారులు, పోలీసులు గుర్తించారు.

అంతా అప్పటికప్పుడే..
రేషన్‌ బియ్యాన్ని పాత యూరియా బస్తాల ద్వారా లారీలో నుంచి కిందకు దించడం, అప్పటికప్పుడే బస్తాల్లో నుంచి బియ్యాన్ని మిల్లులో పోయడం శరవేగంగా చేయస్తున్నారు. సోమవారం శ్రీనివాసులు నాయుడుకు చెందిన వేపకాయల బిల్లు నుంచి రేషన్‌బియ్యాన్ని రైస్‌మిల్లుకు లారీలో తలించి దించుతుండగా పౌరసరఫరాలశాఖ అధికారులకు రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. అధికారులు వెళ్లేసరికి లారీలో కొన్ని బస్తాలు, మిల్లులో దించిన బస్తాలు, బస్తాల్లోంచి మిల్లులో పోసిన బియ్యం ఉన్నాయి. అధికారులను చూసిన కూలీలు పక్కకు వెళ్లిపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న కావలి రూరల్‌ సీఐ టి. మురళీకృష్ణ, ఎస్సై జె. మాల్యాద్రి, టి.అరుణ కుమారి రైస్‌మిల్లు వద్దకు చేరుకొన్నారు.

నంబర్‌ ప్లేటు లేని ఆటోలో..
మిల్లులు పట్టుబడిన రేషన్‌ బియ్యాన్ని పరిశీలిస్తుండగా.. అంతలోనే నంబరు ప్లేటు లేని ఆటోలో పట్టణంలోని వెంగళరావునగర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి 600 కేజీల రేషన్‌ బియ్యాన్ని తీసుకువచ్చారు. దీనిని గమనించి శ్రీనివాసులునాయుడు సోదరుడు మల్లికార్జున ఆ ఆటోను బయటకు పంపించేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించి సీఐ మురళీకృష్ణ, ఎస్సైలు ఆటో ఆపి తనిఖీ చేశారు. కాగా కావలి సివిల్‌ సప్లయీస్‌ డిప్యూటీ తహసీల్దార్‌ కె.వెకంట్రామిరెడ్డి, కావలి డివిజన్‌ అసిస్టెంట్‌ సివిల్‌ సప్లయీస్‌ అధికారి ఐ.పుల్లయ్య, కోవూరు సివిల్‌ సప్లయీస్‌ డిప్యూటీ తహసీల్దార్‌ జీఎస్‌ కృష్ణప్రసాద్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా మీడియా ముసుగులో ఉన్న రేషన్‌ డీలరు ఒకరు ఓవరాక్షన్‌ చేయడం గమనార్హం. శ్రీనివాసులు నాయుడు కుమారుడు మీడియాకు నోటీసులు ఇస్తానని బెదిరించడం విశేషం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top