10 వేల హెక్టార్లలో పంట నష్టం పరిశీలన | 10 thousand hectares of crop damage observation | Sakshi
Sakshi News home page

10 వేల హెక్టార్లలో పంట నష్టం పరిశీలన

Oct 26 2014 1:34 AM | Updated on Sep 2 2017 3:22 PM

హుదూద్ తుపాను తాకిడికి అరటి, బొప్పాయి, జీడి, మామిడి, కొబ్బరి, కూరగాయలు, పామాయిల్ తోటలు జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్నాయనీ, ఇప్పటివరకు

 శృంగవరపుకోట రూరల్ : హుదూద్ తుపాను తాకిడికి అరటి, బొప్పాయి, జీడి, మామిడి, కొబ్బరి, కూరగాయలు, పామాయిల్ తోటలు జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్నాయనీ, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 10 వేల హెక్టార్లలో పంట నష్టాలను పరిశీలించినట్టు ఉద్యానవనశాఖ డిప్యూటీ డెరైక్టర్ ఎల్.వజ్రశ్రీ తెలిపారు. ఎస్.కోట మండలంలోని కిల్తంపాలెం పంచాయతీ పరిధిలో తుపానుకు దెబ్బతిన్న ఉద్యానవన పంటలను ఏడీఏ పీఎల్ ప్రసాద్, హెచ్‌ఓ ఎ.రమేష్‌కుమార్‌లతో కలిసి శనివారం  పరిశీలించారు. అనంతరం స్థానిక ఎంపీపీ రెడ్డి వెంకన్న, ఎంపీటీసీ సభ్యులు ఆర్.చంద్రశేఖర్, ఆడారి రమేష్, పలువురు ప్రజాప్రతినిధులతో పంట నష్టాలపై  చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 5405 హెక్టార్లలో అరటి, 3,258 హెక్టార్లలో కూరగాయలు, 400 హెక్టార్లలో బొప్పాయి, 2503 హెక్టార్లలో కొబ్బరి, 963 హెక్టార్లలో జీడి, 40వేల హెక్టార్లలో మామిడిపంట దెబ్బతిన్నాయన్నారు.  
 
 వరి పంట పరిశీలన
 జియ్యమ్మవలస : మండల పరిధిలోని సీమనాయుడు వలసలో నీట మునిగిన వరి పంటను కేవికే సస్యరక్షణా కేంద్రం శాస్త్ర వేత్త పి.ఉదయ్‌బాబు బృందం పరిశీలించింది. ఈ సందర్బంగా ఉదయ్‌బాబు మాట్లాడుతూ, 50 శాతం మేర నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందజేస్తుందని చెప్పారు. ప్రస్తుతం వరి పంటలో సుడిదోమ ఎక్కువగా ఉందని తెలిపారు. దీని నివారణకు 200 మిల్లీ లీటర్ల డైక్లోరోపాస్, 250 మిల్లీలీటర్ల మోనోక్రోటోపాస్, 200 గ్రాముల కార్బండిజమ్ కలిపి పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎ.డి  విజయ్, కేవికే శాస్త్రవేత్త యు.త్రివేణి, వీఆర్వో వాగ్ధేవి, సత్యం, రైతులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement