మహేశ్‌ ఫొటోషూట్‌లో తొక్కిసలాట..రభస

సాక్షి, హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’.. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బుధవారం గచ్చిబౌలిలోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద హీరో మహేశ్‌బాబుతో ఫ్యాన్స్‌ ఫొటోషూట్‌ను ఏర్పాటు చేశారు. చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే గచ్చిబౌలిలో ఈ ఫొటోషూట్‌ను ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది. అయితే, దీని గురించి తెలియడంతో మహేశ్‌బాబు అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పలువురు అభిమానులు ఈ ఫొటోషూట్‌లో మహేశ్‌తో ఫొటోలు దిగినట్టు సోషల్‌ మీడియాలో, ట్విటర్‌లో వస్తున్న అప్‌డేట్స్‌ను బట్టి తెలుస్తోంది.

అయితే, మహేశ్‌ అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఇక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకొని.. తీవ్ర గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఈ ఫొటోషూట్‌కు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో మహేశ్‌బాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై చందానగర్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమచారం. మహేశ్‌తో ఫొటోషూట్‌ పేరిట ఆన్‌లైన్‌లో పోస్టులు పెట్టిమరీ అభిమానుల్ని ఇక్కడికి రప్పించినట్టు తెలుస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top