అలా చెబితే బాబు దీక్షకు మద్దతిస్తా: జగన్ | YS Jaganmohan Reddy's indefinite fast continues on second day | Sakshi
Sakshi News home page

Oct 6 2013 9:19 AM | Updated on Mar 21 2024 7:50 PM

కేంద్రం నిరంకుశ విధానాలను నిరసిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘సమైక్య దీక్ష’ పేరుతో తన క్యాంపు కార్యాలయం ఎదుట చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. రాజన్న తనయుడు రెండో రోజూ దీక్ష కొనసాగిస్తున్నారు. జననేత దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచీ మద్దతు వెల్లువెత్తింది. ఆయనకు మద్దతుగా ఈ ఉదయం నుంచే జనం దీక్షా ప్రాంగణానికి తరలివస్తున్నారు. ప్రతిఒక్కరిని జగన్ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. రాష్ట్రం కోసం దీక్ష చేస్తున్న జగన్కు ప్రతిఒక్కరు మెచ్చుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. కాగా, సమన్యాయం పాటించకుండా ఇంత అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించడాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టుకు వెళతామని వైఎస జగన్ నిన్న తెలిపారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా గతంలో ఏ రాష్ట్రాన్నీ విడదీయలేదని అన్నారు. కానీ మన రాష్ర్టం విషయానికొచ్చేసరికి తీర్మానం లేకున్నా, ఆరు నెలల్లో ఎన్నికలున్నా అన్నీ పక్కనపెట్టి ఓట్లు, సీట్ల కోసం విడదీస్తామంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా రాష్ట్రంలోని బిడ్డల జీవితాలతో, భవిష్యత్తుతో చెలగాటమాడటం ఎందుకని సోనియాను ప్రశ్నించారు. కేవలం రాహుల్ గాంధీ కోసమే కాకుండా గుక్కెడు తాగునీటి కోసం రోడ్డెక్కుతున్న ఆంధ్రప్రదేశ్‌ బిడ్డల గురించి కూడా ఆలోచించాలని ఆమెకు సూచించారు. చంద్రబాబు దీక్ష ఎందుకు చేయాలనుకున్నారో చెప్పాలని జగన్‌ ప్రశ్నించారు. ‘ఈ విభజనను నేను వ్యతిరేకిస్తున్నాను, సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించండి’ అంటూ లేఖ రాసిన తర్వాతే దీక్షకు కూర్చోవాలని డిమాండ్‌ చేశారు. అప్పుడు తాను కూడా ముందుకొచ్చి బాబు దీక్షకు మద్దతిస్తానన్నారు. ‘వాళ్లేదో బుద్ధి లేక రాష్ట్రాన్ని విభజిస్తే మీరెందుకు మద్దతు పలుకుతున్నారు?’ అని ఈ సందర్భంగా చంద్రబాబును ప్రశ్నిస్తున్నానన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement