దేవకి.. యశోద.. ఇద్దరు తల్లుల బిడ్డ శ్రీకృష్ణుడు. మనకు తెలిసి ఇలా కన్నతల్లిదండ్రులు, పెంచిన తల్లిదండ్రులు వేర్వేరుగా ఉంటారు. కానీ, ఒక బిడ్డకు నేరుగానే ముగ్గురు తల్లిదండ్రులు ఉండటం సాధ్యమేనా? ముగ్గురికీ కలిపి ఒక బిడ్డ పుట్టడం ఎప్పుడైనా విన్నారా? ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అమెరికాలో ఇలాంటి సరికొత్త ఫెర్టిలిటీ టెక్నిక్ను ఉపయోగించి ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పుడు ఐదు నెలల వయసున్న ఈ బిడ్డకు తన తల్లిదండ్రుల నుంచి సాధారణంగా సంక్రమించే డీఎన్ఏ ఉంది. దాంతోపాటు.. మరో దాత నుంచి స్వీకరించిన చిన్న జెనెటిక్ కోడ్ కూడా ఉంది. అంటే, తల్లిదండ్రులు ఇద్దరితో పాటు మరో తల్లి కూడా ఈ బిడ్డకు ఉందన్నమాట. వైద్యశాస్త్రంలోనే అత్యంత అరుదైన ఈ ప్రయోగాన్ని.. మానవాళి మేలు కోసమే చేశామంటున్నారు వైద్యులు. అత్యంత అరుదైన జన్యు పరిస్థితులతో బాధపడే కుటుంబాలలో పుట్టే పిల్లలను కాపాడేందుకు ఇలాంటి ప్రయత్నం చేశామన్నారు. ఇది రాబోయే రోజుల్లో వైద్యశాస్త్రంలోనే మంచి మలుపు అవుతుందన్నారు. అయితే.. ఇలాంటి కొత్త, వివాదస్పద టెక్నాలజీని పూర్తిస్థాయిలో పరిశీలించాలని చెబుతున్నారు. ఈ పద్ధతికి మైటోకాండ్రియా దానం అని పేరుపెట్టారు.