breaking news
mitochondria donation
-
అరుదైన ప్రయోగం.. ముగ్గురి డీఎన్ఏతో జన్మించిన శిశువు.. పోలికలు వాళ్లవే!
లండన్: బ్రిటన్ శాస్త్రవేత్తలు సంచాలనాత్మక శాస్త్రీయ ప్రయోగంలో విజయం సాధించారు. ఆ దేశంలో తొలిసారి ఓ శిశువు ముగ్గురి డీఎన్ఏలతో జన్మించింది. ఇందులో 99.8 శాతం డీఎన్ఏ తల్లిదండ్రలదే కాగా.. మిగతా శాతం మహిళా దాతది. వినాశకరమైన మైటోకాండ్రియల్ వ్యాధులతో పిల్లలు పుట్టకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ సాంకేతికతను ఉయోగిస్తున్నారు. దీనికి మైటోకాండ్రియల్ డోనేషన్ ట్రీట్మెంట్(ఎండీటీ)గా నామకరణం చేశారు. ఈ పద్ధతిలో ఆరోగ్యవంతమైన మహిళా దాత అండాల కణజాలన్ని ఉపయోగించి ఐవీఎఫ్ పిండాలను సృష్టిస్తారు. తద్వారా పిల్లలకు తల్లుల ద్వారా మైటోకాండ్రియా సోకకుండా నిరోధిస్తారు. మైటోకాండ్రియా వ్యాధులు అత్యంత ప్రమాదకరమైనవి. వీటితో పుట్టిన బిడ్డలు గంటల్లో లేదా కొన్ని రోజుల తర్వాత చనిపోయే ప్రమాదం ఉటుంది. తల్లుల ద్వారా మాత్రమే పిల్లలకు ఈ వ్యాధులు సోకుతాయి. అందుకే వీటిని నిరోధించేందుకు ఇతర మహిళల అండాల కణజాలాన్ని ఉపయోగిస్తున్నారు. ఫలితంగా పిల్లలు మైటోకాండ్రియా వ్యాధుల బారినపడకుండా చేస్తున్నారు. పోలికలు తల్లిదండ్రులవే.. ఈ పద్ధితిలో జన్మించిన శిశువు తన తల్లిదండ్రుల ద్వారా వచ్చే న్యూక్లియర్ డీఎన్ఏను కలిగి ఉంటుంది. అందుకే శిశువు వ్యక్తిత్వం, కంటి రంగు వంటి ముఖ్యమైన లక్షణాలు తల్లిదండ్రుల లాగే ఉంటాయి. అయితే ఈ విధానంలో పుట్టిన బిడ్డ తల్లిదండ్రుల వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయని, ఇప్పటివరకు అతికొద్ది మంది మాత్రమే ఇందులో భాగమయ్యారని శాస్త్రవేత్తలు తెలిపారు. అందుకే దీని భద్రత, ప్రభావశీలత గురించి ఇప్పుడే ఓ అంచనాకు రాలేమన్నారు. ఎండీటీ పద్ధతి ద్వారా శిశువు జన్మించిన ఘటన యూకేలో ఇదే తొలిసారి అయినప్పటికీ.. అమెరికాలో మాత్రం 2016లోనే ఈ ప్రయోగం జరిగింది. జోర్డాన్కు చెందిన ఓ జంట ఈ సాంకేతికతతోనే ఆ ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చదవండి: ట్రంప్కు బిగ్ షాక్.. లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేల్చిన జ్యూరీ.. రూ.410 కోట్లు చెల్లించాలని ఆదేశం -
ఆ బిడ్డకు ముగ్గురు తల్లిదండ్రులు!
-
ఆ బిడ్డకు ముగ్గురు తల్లిదండ్రులు!
దేవకి.. యశోద.. ఇద్దరు తల్లుల బిడ్డ శ్రీకృష్ణుడు. మనకు తెలిసి ఇలా కన్నతల్లిదండ్రులు, పెంచిన తల్లిదండ్రులు వేర్వేరుగా ఉంటారు. కానీ, ఒక బిడ్డకు నేరుగానే ముగ్గురు తల్లిదండ్రులు ఉండటం సాధ్యమేనా? ముగ్గురికీ కలిపి ఒక బిడ్డ పుట్టడం ఎప్పుడైనా విన్నారా? ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అమెరికాలో ఇలాంటి సరికొత్త ఫెర్టిలిటీ టెక్నిక్ను ఉపయోగించి ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పుడు ఐదు నెలల వయసున్న ఈ బిడ్డకు తన తల్లిదండ్రుల నుంచి సాధారణంగా సంక్రమించే డీఎన్ఏ ఉంది. దాంతోపాటు.. మరో దాత నుంచి స్వీకరించిన చిన్న జెనెటిక్ కోడ్ కూడా ఉంది. అంటే, తల్లిదండ్రులు ఇద్దరితో పాటు మరో తల్లి కూడా ఈ బిడ్డకు ఉందన్నమాట. వైద్యశాస్త్రంలోనే అత్యంత అరుదైన ఈ ప్రయోగాన్ని.. మానవాళి మేలు కోసమే చేశామంటున్నారు వైద్యులు. అత్యంత అరుదైన జన్యు పరిస్థితులతో బాధపడే కుటుంబాలలో పుట్టే పిల్లలను కాపాడేందుకు ఇలాంటి ప్రయత్నం చేశామన్నారు. ఇది రాబోయే రోజుల్లో వైద్యశాస్త్రంలోనే మంచి మలుపు అవుతుందన్నారు. అయితే.. ఇలాంటి కొత్త, వివాదస్పద టెక్నాలజీని పూర్తిస్థాయిలో పరిశీలించాలని చెబుతున్నారు. ఈ పద్ధతికి మైటోకాండ్రియా దానం అని పేరుపెట్టారు. మైటోకాండ్రియా అనేది శరీరంలో ఉండే ప్రతి కణంలోనూ ఉండే చిన్నపాటి నిర్మాణం. ఇది మనం తినే ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. కొంతమంది మహిళలకు మైటోకాండ్రియాకు సంబంధించిన జన్యులోపం ఉంటుంది. అది వాళ్ల పిల్లలకు కూడా వస్తుంది. లీ సిండ్రోమ్ అనే ఒక జన్యుపరమైన లోపం జోర్డాన్లోని ఓ కుటుంబానికి ఉంది. దానివల్ల వాళ్లు పిల్లలను కంటే, ఆ పిల్లలు బతికే అవకాశం లేదు. ఆ మహిళకు నాలుగుసార్లు అబార్షన్ కాగా, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత చనిపోయారు. ఒకరు 8 నెలల వయసులోను, మరొకరు ఆరేళ్ల వయసులోను మరణించారు. ఇలాంటి కుటుంబాలను కాపాడేందుకే శాస్త్రవేత్తలు కొత్త పద్ధతులు కనుగొన్నారు. మెక్సికోలో ఇలాంటి పద్ధతుల మీద ఎలాంటి నిషేధం లేదు కాబట్టి వైద్యబృందం ఆ జంటను అక్కడకు తీసుకెళ్లింది. తల్లి అండాల నుంచి సేకరించిన డీఎన్ఏతో పాటు.. ఒక దాత అండాల నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన మైటోకాండ్రియాను ఉపయోగించి, పూర్తిగా ఆరోగ్యకరమైన అండాన్ని తండ్రి వీర్యంతో ఫలదీకరించారు. ఫలితంగా పుట్టిన బిడ్డకు దాత నుంచి 0.1% డీఎన్ఏ (మైటోకాండ్రియల్ డీఎన్ఏ) వచ్చింది. మిగిలిన జన్యుకోడ్ అంతా.. అంటే జుట్టు, కళ్ల రంగు అన్నీ తల్లిదండ్రుల నుంచే వచ్చాయి. న్యూయార్క్ నగరంలోని న్యూ హోప్ ఫెర్టిలిటీ సెంటర్కు చెందిన డాక్టర్ జాన్ ఝాంగ్, ఆయన సహచరులు ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. అయితే ఆ బిడ్డ పెరిగిన తర్వాత తన డీఎన్ఏ ప్రకారం తల్లిదండ్రులు ఎవరన్న ప్రశ్న తలెత్తే అవకాశం ఉందని కొందరు వాదిస్తున్నారు. విజయవంతంగా బిడ్డ పుట్టి పూర్తి ఆరోగ్యకరంగా ఉన్న సందర్భాల గురించి మాత్రమే ఈ ప్రయోగాలలో బయటకు చెబుతున్నారని, విఫలమైన ప్రయోగాల విషయాలు మాత్రం బయటకు రాకుండా తొక్కేస్తున్నారని మరికొందరు అంటున్నారు. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ కూడా తాము సమాధానం ఇస్తామని.. అక్టోబర్లో అమెరికన్ సొసైటీ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ సమావేశంలో జవాబిస్తామని డాక్టర్ జాంగ్, ఆయన బృంద సభ్యులు చెబుతున్నారు.