నేటి బాధితుడే.. నాటి నిందితుడు! | nagaraju-told-to-be-accused-in-highway-murder-case | Sakshi
Sakshi News home page

Apr 1 2015 3:26 PM | Updated on Mar 22 2024 10:58 AM

సరూర్నగర్ జింకలబావి సమీపంలో కాల్పులకు గురైన నాగరాజు.. గతంలో ఏలూరు హైవేపై జరిగిన పినకడిమి హత్యకేసులో నిందితుడు. గత ఏడాది ఏప్రిల్ 6వ తేదీన ఏలూరు జేకే ప్యాలెస్ అధినేత భూతం దుర్గారావు హత్యకేసులో నాగరాజే ప్రధాన నిందితుడు. అప్పటినుంచి నాగరాజు పరారీలో ఉన్నాడు. అతడితో పాటు 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య జరిగిన వారం రోజుల తర్వాత నాగరాజు బృందం పోలీసులకు లొంగిపోయింది. పదిరోజుల పోలీసు కస్టడీ తర్వాత నాగరాజుతో పాటు అతడి ఇద్దరు కుమారులు పరారయ్యారు. అయితే, పోలీసులే డబ్బులు తీసుకుని వాళ్లను వదిలేశారని భూతం దుర్గారావు బంధువులు ఆరోపించారు. (సరూర్ నగర్లో కాల్పుల కలకలం) నాగరాజు పరారైన తర్వాత దుర్గారావు సోదరులు గోవింద్, శ్రీనివాసరావు సెప్టెంబర్ నెలాఖరులో కృష్ణాజిల్లా పెద అవుటపల్లి వద్ద ప్రతీకార హత్యలు జరిగాయి. ఢిల్లీ గ్యాంగుకు సుపారీ ఇచ్చి మరీ దుర్గారావు అనుచరులు ఈ హత్యలు చేయించారు. అప్పటినుంచి భూతం గోవింద్, భూతం శ్రీనివాసరావు అజ్ఞాతంలోనే ఉన్నారు. కాగా, ఇప్పుడు నాగరాజుపై కాల్పులు జరగడంతో.. ఈ ఘటనలో భూతం గోవింద్, భూతం శ్రీనివాసరావులకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. భూతం దుర్గారావు వర్గీయులు, నాగరాజు కుటుంబాల మధ్య మొదలైన వివాదం వరుస హత్యలు, హత్యాయత్నాలకు దారితీస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement