కరువు సీమ పాలమూరు జిల్లాకు ఎత్తిపోతల పథకం ద్వారా నీరందించే ప్రయత్నాలకు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన అనుచరులు అడ్డంపడుతున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కొత్తగా చేపడుతోన్న పాలమూరు ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేనందున వెంటనే నిలిపివేయాలని కోరుతూ సెంట్రల్ వాటర్ కమిషన్ కు చంద్రబాబు లేఖరాయడాన్ని ఆమె తప్పుపట్టారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. 'పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసింది తన చిరకాల మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డేనన్న సంగతి చంద్రబాబు మర్చిపోయారు. ఈ ప్రాజెక్టుకు అడ్డంపడుతోన్న టీడీపీ నాయకులు.. ఆర్డీఎస్ నుంచి రాయలసీమ గుండాలు నీళ్లు మళ్లించుకుపోయినప్పుడు ఎక్కడికి పోయారు? అంతేకాదు జూరాల నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని మళ్లించుకు పోతుంటే మిన్కకుండి పోతారేం?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.