టీవీలలో వచ్చే క్రైం సీరియళ్లు యువత మీద దారుణమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. తమ పక్కింట్లో ఉండే బాలుడిని నమాజ్కు వెళ్తుండగా కిడ్నాప్ చేసి అతడిని హతమార్చాడు. దాదాపు రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటనలో ఆధారాలు తాజాగా బయటపడ్డాయి. చాంద్రాయణగుట్టకు చెందిన ఉరూజుద్దీన్ అనే బాలుడు ఏప్రిల్ 22వ తేదీ ఉదయం ఇంట్లోంచి వెళ్లి, రాత్రయినా తిరిగి రాలేదు. దాంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా విచారించినప్పుడు చివరిసారిగా తాము పక్కింట్లో ఉండే మునీర్తో అతడిని చూశామని చెప్పారు. దాంతో అతడిని అదుపులోకి తీసుకోగా.. అతడి కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ రెండు కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉంటాయని, అలాంటప్పుడు తమవాడి మీద ఎందుకు అనుమానించి తమను వేధిస్తారని తిరగబడ్డారు. దాంతో పోలీసులు కాస్త నెమ్మదించారు.