రథోత్సవంలో గంగారాజరాజేశ్వరి సమేత అగస్త్యేశ్వరస్వామి రథాన్ని లాగుతున్న భక్తులు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక రామేశ్వరంలోని శ్రీముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం రథోత్సవం జరిగింది. భక్తుల శివనామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. వేకువజామన శ్రీరామచంద్రుడు ప్రతిష్టించిన సైకత లింగానికి, రాజరాజేశ్వరి అమ్మవారికి, చండీమాతకు, ఆదిశంకరాచుర్యులు ప్రతిష్టించిన శ్రీచక్రానికి, హనుమత్ లింగేశ్వరుడు, కాశీఅన్నపూర్ణేశ్వరికి అభిషేకాలు, అర్చనలు చేశారు. లోకకల్యాణార్థం గణపతి, నవగ్రహ, రుద్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం గంగా రాజరాజేశ్వరి సమేత ముక్తిరామలింగేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. రథంపై కొలువుదీర్చి పురవీధుల్లో రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో మంగళవాయిద్యాలు, నరసరావుపేట తప్పెట్లు, మైదుకూరు కళాకారుల కోలాటం, పార్వతీపరమేశ్వరుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మధ్యాహ్నం 5 వేల మందికిపైగా భక్తులకు అన్న ప్రసాద వినియోగం జరిగింది. తిరిగి సాయంత్రం ప్రారంభమైన రథోత్సవం భక్తజనుల నీరాజనాల మధ్య వేడుకగా ఆలయానికి చేరుకుంది. కార్యక్రమంలో ఈఓ శ్రీధర్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రాజారెడ్డి, ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు నిర్వహించారు.
వైభవంగా ముక్తిరామలింగేశ్వరస్వామి
రథోత్సవం


