కడప సెవెన్రోడ్స్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 11వ తేదీన మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 9.30 గంటలకు పాత బస్టాండులోగల మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి నివాళులర్పించడంతోపాటు 10.30 గంటలకు కలెక్టరేట్లో జయంతి ఉత్సవం ఉంటుందని పేర్కొన్నారు. అధికారులు, ఎస్సీ ఎీస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
కడప కార్పొరేషన్/సెవెన్రోడ్స్: ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం, టౌన్ప్లానింగ్ సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయడం కోసం కడప నగరపాలక సంస్థలో ప్రతి శుక్రవారం ఓపెన్ ఫోరం నిర్వహించనున్నట్లు కలెక్టర్, నగరపాలక ప్రత్యేకాధికారి శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో కమిషనర్, సిటీ ప్లానర్, టౌన్ప్లానింగ్ అధికారులు, రెగ్యులేషన్ సెక్రటరీలతో సమీక్ష నిర్వహించబడుతుందన్నారు. నగరాభివృద్ధికి సంబంధించిన ప్రస్తుత పనులు, అనుమతుల ప్రక్రియ, పెండింగ్ దర ఖాస్తులు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు వంటి వాటిపై చర్చించి తగిన మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. ఈ ఓపెన్ ఫోరంలో టౌన్ప్లానింగ్ అధికారులతోపాటు లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్(ఎల్టీపీ)లు ప్రత్యక్షంగా పాల్గొని ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తారన్నారు. భవన నిర్మాణ అనుమతులు, బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం(బీపీఎస్), లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్), ట్రాన్స్ఫరబుల్ డెవెలప్మెంట్ రైట్స్(టీడీఆర్)లకు సంబంధించిన అనుమతులు, పెండింగ్ ఫైళ్లు, సాంకేతిక సమస్యలు ఉన్నవారు ఈ ఓపెన్ ఫోరంలో పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కారం పొందవచ్చని తెలిపారు.
గుర్రంకొండ: మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి హుండీ ద్వారా రూ.16,20,150ల ఆదాయం సమకూరింది. గురువారం స్థానిక ఆలయంలో టీటీడీ సూపరింటెండెంట్ మునిబాల ఆధ్వర్యంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. టీటీడీ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, టీటీడీ విజిలెన్స్అధికారి మల్లికార్జున, సిబ్బంది నాగ రాజ, అర్చకులు గోపాలాబట్టర్, కృష్ణ, రాజు, గోకుల్, వరదరాజ స్వాములు పాల్గొన్నారు.
కడప అగ్రికల్చర్: జిల్లాస్థాయిలో ప్రకృతి వ్యవసాయంపై అనుబంధ శాఖలతో నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది. చివరి రోజు కలెక్టర్ ఆఫీస్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణ్యేశ్వరరావు మాట్లాడుతూ అన్ని శాఖల సిబ్బంది ఎల్నినోను దృష్టిలో ఉంచుకుని పని చేయాలని వివరించారు. జిల్లా ప్రాజెక్టు మేనే జర్ యస్వీ ప్రవీణకుమార్ మాట్లాడుతూ ఈ మూడు రోజులు శిక్షణ సూచించిన సలహాలను, సూచనలు క్షేత్రస్థాయిలో అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావును ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ యస్వీ ప్రవీణ్ కుమార్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీడీఏ, ఏడీఏ, ఏఓ, హెచ్ఓ, ఏపీఎం, డీహెచ్ఓ, డీఎస్ఓ, ఆత్మపీడి, డీఆర్డీఏ పీడి, ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.


