– ఫ్యాన్కు ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
లింగాల : లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎర్ర మేకల భరత్ కుమార్ (23) బుధవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ యువకుడు గత కొన్ని సంవత్సరాల నుంచి కుడి కన్ను సమస్యతో బాధ పడుతుండే వాడు. ఇటీవల కుడి కన్ను పూర్తిగా చూపు కోల్పోయింది. దీనికి తోడు మైగ్రేన్ తలనొప్పి వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్కు ఉరి వేసుకున్నట్లు సమాచారం. శ్రీనా చావుకు నేనే కారణం.. ప్రతి రోజు హాస్పిటల్ చుట్టూ తిరగలేకున్నా.. నా ఆరోగ్యం రోజు రోజుకు ఇబ్బందిగా ఉంది.. అమ్మా.. నాన్నా నన్ను క్షమించండి అంటూ మృతుడు భరత్ కుమార్ సూసైడ్ నోట్ రాశాడు. యువకుడి మృతితో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగింది.
ఇంటి గేటు మీద పడటంతో చిన్నారి దుర్మరణం
ముద్దనూరు : అవ్వగారింటి వద్ద ఆనందంతో ఆడుతూ పాడుతూ వున్న చిన్నారి కుటుంబంలో ఇంటిగేటు విషాదం నింపింది. మండలంలోని నల్లబల్లె గ్రామంలో ఇంటివద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు ఇంటి గేటు అనుశ్రీ అనే చిన్నారిమీద పడడంతో చిన్నారి దుర్మరణం చెందింది. బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలు మృతురాలి కుటుంబీకుల సమాచారం మేరకు .. తొండూరు మండలం ఊడగండ్ల గ్రామానికి చెందిన రవికుమార్, గాయత్రిల ఆరేళ్ల కూతురు అనుశ్రీ అవ్వగారి గ్రామమైన నల్లబల్లెకు వచ్చింది. అనుశ్రీ ఇంటి వద్ద ఆడుకుంటుండగా ఇంటి ప్రహరీకి అమర్చిన ఇనుప గేటు అకస్మాత్తుగా చిన్నారిపై పడింది. దీంతో తీవ్ర గాయాలపాలైన అనుశ్రీని ముద్దనూరులోని ఓ ప్రైవేటు ఆసపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు. అవ్వగారింటికి వచ్చిన చిన్నారి దుర్మరణం చెందడంపై బంధువులలో విషాదం చోటుచేసుకుంది.
మోటారు వైర్లు చోరీ
వేంపల్లె : పంటలకు నీటి తడులందించేందుకు పొలాల్లోని బోర్లకు అమర్చిన విద్యుత్ సబ్ మెర్సిబుల్ మోటార్ల వైర్లను గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. దీంతో పంటలు సాగు చేసిన రైతులు లబోదిబోమంటున్నారు. వేంపల్లె పంచాయతీ పరిధిలోని చింతలమడుగుపల్లె, వైఎస్ మదీనాపురానికి చెందిన రైతులు నిమ్మ, చీనీ, అరటితో పాటు పలు పంటలను సాగు చేశారు. పొలాల్లో బోర్లను వేసుకొని డ్రిప్ సహాయంతో నీటి తడులను పంటలకు అందించేందుకు సబ్ మెర్సిబుల్ మోటార్లను బిగించుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు రైతులు పంట పొలాల్లో అమర్చుకున్న మోటార్లకు చెందిన వైర్లను మంగళవారం రాత్రి కత్తిరించి ఎత్తుకెళ్లారు. బుధవారం పంటలకు నీటి తడులందించేందుకు పంట పొలాల వద్దకు వెళ్లిన రైతులు వైర్లు కత్తిరించిన విషయం గమనించి లబోదిబో మంటున్నారు. ఒకే రోజు దాదాపు 20 మంది రైతులకు చెందిన మోటారు వైర్లు చోరీకి గురయ్యాయని రైతులు అంటున్నారు. వైఎస్ మదీనా పురం, చింతలమడుగుపల్లెకు చెందిన చిన్న ఖాసీం, పఠాన్ రషీద్, రమేష్, సయ్యద్ ఖాసీం, షేక్.షరీఫ్, పఠాన్ అబ్దుల్ మాలిక్, సయ్యద్ రఫీతోపాటు మరి కొందరి రైతుల పొలాల్లో ఈ చోరీ జరిగింది. పంట పొలాల్లో విద్యుత్ పరికరాల చోరీకి పాల్పడుతున్న దొంగలను పట్టుకోవాలని రైతులు పోలీసులను కోరుతున్నారు.
ఆటో ఢీకొని బాలుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : ఆటో ఢీకొని బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. పుంగనూరు మండలం ఈడిగిపల్లికి చెందిన షాంషా బొమ్మల వ్యాపారం కోసం కుమారుడు ప్రవీణ్(15)తో మదనపల్లెకు వచ్చింది. తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్లడానికి తమ బంధువులతో కలిసి ఆటోలో బయలుదేరింది. పట్టణ శివారు ప్రాంతమైన పుంగనూరు రోడ్డు మహీంద్రా షోరూం వద్దకు రాగానే, వారు ప్రయాణిస్తున్న ఆటో పక్కకు నిలిపి, ప్రవీణ్ ఆటో దిగి పక్కనే ఉండగా, ఎదురుగా మరో ఆటో వేగంగా వచ్చి బాలుడిని ఢీకొంది. ప్రమాదంలో ప్రవీణ్ తీవ్రంగా గాయపడగా గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రేఫర్ చేశారు.

మోటారు వైర్లు చోరీ