
నగరపాలక సర్వసభ్య సమావేశానికి భద్రత కల్పించండి
కడప కార్పొరేషన్ : కడప నగరపాలక సంస్థలో ఈనెల 20వ తేదీ నిర్వహించే సర్వసభ్య సమావేశానికి తగిన భద్రత కల్పించాలని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కోరారు. సోమవారం వారు జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్లకు వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో జరిగి సర్వసభ్య సమావేశాల్లో బయటి వ్యక్తులు సభలోకి రావడంతో సభలో గందరగోళం ఏర్పడిందన్నారు. మేయర్, కార్పొరేటర్లు ఆమోదించిన ఎజెండాను కమిషనర్ తాను వినలేదు అని చెప్పి సెక్రటరీ వద్ద ఉన్న మినిట్స్ పుస్తకాన్ని కమిషనర్ తెప్పించుకొని ఆయనవద్దే ఉంచుకొని నెలరోజులపాటు తీర్మానాలను ఆమోదించలేదన్నారు. అప్పటి నుంచి కౌన్సిల్ హాలుకు తాళాలు వేశారని, హాలును తెరవాలని మేయర్, కార్పొరేటర్లు కలిసి రాతమూలకంగా తెలిపినా పట్టించుకోలేదన్నారు. ఈనెల 20న సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో అందులో వసతుల కల్పనకు ఈనెల 18వ తేదీ కౌన్సిల్ హాలు తెరిచేందుకు తగు సూచనలు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే మాధవి కార్పొరేషన్కు సంబంధం లేని వ్యక్తులతో సభలోకి ప్రవేశించడాన్ని నిరోధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు షఫీ, కె. బాబు, రామలక్ష్మణ్రెడ్డి, శివకోటిరెడ్డి, షంషీర్, జహీర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీరంజన్రెడ్డి, డివిజన్ ఇన్చార్జులు జమాల్వలీ, ఎస్ఎండీ రిజ్వాన్, సుబ్బరాయుడు పాల్గొన్నారు.
జేసీ, ఎస్పీలకు వైఎస్సార్సీపీ
కార్పొరేటర్ల వినతి