
● తల్లులను ప్రోత్సహించేందుకు..
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లాలో 3,05,330 మంది విద్యార్థులు పదవ తరగతి వరకూ విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో 2,41,119 మందిని మాత్ర మే అర్హులుగా నిర్ణయించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు మరో17,904 మంది ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరికి ఇప్పటి వరకూ ఈ పథకం వర్తింపజేయలేదు. ప్రభుత్వం పథకం అమలు చేయడంలో సాధ్యమైనంత తక్కవ మంది లబ్ధిదారులు ఉండేలా ఎత్తుగడ వేసింది. ఈక్రమంలో 300 యూనిట్లు విద్యుత్ వాడకం, 300 గజాల ఇళ్లు, పట్టణాల్లో 1000 చదరపు అడుగులు ఇంటి స్థలం, ఫోర్ వీల్ వాహనం, మెట్ట భూమి పదెకరాల లోపు ఉండాలంటూ నిబంధనలు పెట్టింది. ఈకారణాలతో అనేక మంది అనర్హులు జాబితాలోకి వెళ్తున్నారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు దక్కని వైనం....
చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రాగానే ప్రకటించిన హామీలు అమలు చేసింటే గత ఏడాది ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం వర్తించేది. దాదాపు 16,669 మంది ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. తాజాగా 17,904 మంది ఇంటర్ చదువుతోన్నారు. వారిలో ఏ ఒక్కరికి తల్లికివందనం పథకం అమలు కాలేదు. తాజా నిబంధనల కారణంగా 10వ తరగతి లోపు విద్యార్థులు 64,211 మందికి అందలేదు. అటు ఇంటర్ విద్యార్థులతో కలిపితే 82,115 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు నగదు జమ కాకపోవడం విశేషం.
● విద్యుత్ వినియోగాన్ని పరిగణలోకి తీసుకోవడంతో తల్లికి వందనం పథకంలో చాలామంది విద్యార్థులు అనర్హులుగా మారుతున్నారు.గృహ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటినా అనర్హత వేటు పడుతుంది.
ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికి తల్లికి వందనం పథకం కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తానంటూ గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తీరా గద్దెనెక్కిన తర్వాత తొలి ఏడాది విజయవంతంగా ఎగ్గొట్టేశారు. పాలనకు రెండో ఏడాది ప్రారంభయ్యాక తొలిసారి అమల్లోకి తెచ్చిన తల్లికి వందనాన్ని నిబంధనల చట్రంలో ఇరికించారు. ఆచరణకొచ్చేసరికి కొర్రీలతో కోతలు పెట్టారు. దీంతో విద్యార్థుల తల్లిదుండ్రులు కూటమిసర్కార్ తీరుపై ఆగ్రహిస్తున్నారు. ఎన్నికలప్పుడు ఒకలా..అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడటం చంద్రబాబుకు కొత్తేమి కాదని విమర్శిస్తున్నారు.
అర్హులకు అన్యాయం..!
● నిబంధనలతో పథకానికి తూట్లు
● 300 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే అనర్హత
● వైఎస్సార్ జిల్లాలో 3.05 లక్షల మంది విద్యార్థులు
● 2.41 లక్షల మంది మాత్రమే అర్హులుగా తేల్చిన వైనం
● తక్కిన వారి పరిస్థితి అగమ్యగోచరం
విద్యను అభ్యసించాల్సిన వయస్సులో పనులకు వెళ్లడం, అర్ధాంతరంగా పిల్లలను పాఠశాల మాన్పించడం లాంటివి నిరోధించేందుకు వైఎస్సార్సీపీ సర్కార్లో అమ్మఒడి పథకం రూపుదిద్దుకుంది. నాడు–నేడు పథకం ద్వారా పాఠశాలల్లో చక్కటి వసతులు కల్పిస్తూ, ఇంగ్లీషు మీడియం విద్యా బోధన అందుబాటులోకి తీసుకొచ్చింది. మరోవైపు పనుల కోసం పిల్లల్ని పాఠశాలకు వెళ్లకుండా అడ్డుకునే చర్యలకు చెక్ పెట్టేందుకు తల్లుల బ్యాంకు అకౌంట్కు రూ.13వేల నగదు జమ చేస్తూ మరో రూ.2వేలు పాఠశాల మెయింటెన్స్కు వెచ్చించేవారు. ఈక్రమంలో ఎన్నికల ముందు ఎంత మంది పిల్లలు చదువుకుంటే అందరికీ తల్లికి వందనం పేరిట రూ.15వేలు చొప్పున బ్యాంకు అకౌంట్లకు జమ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు మాట మార్చి రూ.13వేలు చొప్పున అందిస్తున్నారు. హామీని యధావిధిగా అమలు చేస్తే పదో తరగతిలోపు చదివే పిల్లలకు జిల్లాలో 3,05,330 మందికి అందాల్సి ఉంది. తాజా నిబంధనలతో 2,41,119 మందికి మాత్రమే ఈ పథకం అందుతోంది.

● తల్లులను ప్రోత్సహించేందుకు..