
రమణీయం.. రథోత్సవం
● వైభవంగా పుష్పగిరి బ్రహ్మోత్సవాలు
● స్వాములు, అమ్మవార్లకు విశేష పూజలు
● భారీగా పాల్గొన్న భక్తజనం
● మార్మోగిన హరిహరుల నామస్మరణ
● పూజల్లో పాల్గొన్న
వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు
పుష్పగిరిని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథరెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పీ నరేన్ రామాంజులురెడ్డి సందర్శించారు. కొండపైన గల శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో స్వామి వారిని, లక్ష్మీదేవిని, సంతాన మల్లేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని శ్రీ వైథ్యనాథేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని, శ్రీ కామాక్ష్మీ మాతను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకరభారతి స్వామిని దర్శించుకుని ఆయనచే ఆశీర్వచనాలను పొందారు. అనంతరం శ్రీ వైద్యనాథ స్వామి రథోత్సవంలో భాగంగా రథం వద్ద జరిగిన పూజల్లో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఇందిరెడ్డి శంకర్రెడ్డి, బాకరాపురం వెంకట సుబ్బారెడ్డి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
వల్లూరు: పుష్పగిరిలోని శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం హరిహరుల రథోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. పుష్పగిరి భక్తజన సంద్రంగా మారింది. ఉదయం శ్రీ వైద్యనాఽథేశ్వరస్వామి రథోత్సవం జరిగింది. శ్రీ కామాక్షీ సమేతుడైన వైద్యనాథస్వామి రథంలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. పూజల అనంతరం శివ నామాన్ని స్మరిస్తూ భక్తులు పోటీ పడి రథాన్ని లాగారు. కాయ కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
● సాయంత్రం శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి రథోత్సవం జరిగింది. బ్రహ్మోత్సవాల ప్రారంభం నుంచి గ్రామోత్సవాలలో వివిధ వాహనాలపై ఒంటరిగా దర్శనమిచ్చిన చెన్నకేశవస్వామి కల్యాణ మహోత్సవంతో పరిపూర్ణుడై శ్రీదేవి, భూదేవిలతో కలిసి రథంపై ఆశీనులయ్యారు. బంగారు ఆభరణాలతో అలంకార భూషితులైన స్వామివారు ఇద్దరు దేవేరులతో కలిసి దర్శనమివ్వడంతో.. సాక్షాత్తు వైకుంఠంలోని శ్రీహరి అంశకు చెందిన శ్రీ వెంకటేశ్వరున్ని దర్శించుకున్నట్లుగా భక్తులు పులకించి పోయారు. ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో రథం వద్ద పూజలు చేశారు. అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రథ సంప్రోక్షణ, అభిషేకాలు నిర్వహించారు. రథ ప్రారంభ పూజ, వాస్తు పూజ, శాంతి, అష్టబలి, కుష్మాండబలి, ఉత్సవ మూర్తుల దేవతా రాధన, మహా మంగళ హారతి నిర్వహించారు. గోవింద నామాలను జపిస్తూ భక్తులు రథం గొలుసులను పట్టుకుని లాగారు. పుష్పగిరి మాడ వీధుల్లో భక్తులు కాయ కర్పూరాలను సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తలు భారీగా తరలివచ్చారు.
● రథాల వద్ద జరిగిన పూజల్లో పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతి, ఆలయ అనువంశిక ధర్మకర్త దుగ్గిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, మురళీమోహన్రెడ్డి పాల్గొన్నారు.
పుష్పగిరిలో నేడు
పుష్పగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి శ్రీ కామాక్షీ వైద్యనాథస్వామి, శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి అశ్వవాహనంపై దర్శనమివ్వనున్నారు.

రమణీయం.. రథోత్సవం

రమణీయం.. రథోత్సవం

రమణీయం.. రథోత్సవం

రమణీయం.. రథోత్సవం