లోకేష్ పాదయాత్ర...ఫ్లెక్సీల కోసం రోడ్లకు తూట్లు
మైదుకూరు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర సందర్భంగా మైదుకూరులో టీడీపీ వర్గీయులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేందుకు ప్రధాన రహదారులను తవ్వేశారు. ప్రొద్దుటూరు నుంచి లోకేష్ మైదుకూరు నియోజకవర్గంలో అడుగు పెట్టి శనివారం సాయంత్రం మైదుకూరు పట్టణంలో పాదయాత్ర, రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా తమ నాయకుడికి స్వాగతం పలికేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక రాయల కూడలి నుంచి నాలుగు ప్రధాన రోడ్లలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అందుకోసం కొయ్యలను పాతేందుకు రోడ్లపై డ్రిల్లింగ్ చేసి రంధ్రాలు వేశారు. దీని వల్ల రహదారులు దెబ్బతినే అవకాశం ఉన్నా టీడీపీ కార్యకర్తలు ఖాతరు చేయలేదు. దీనిపై సంబంధిత హైవే అధికారులు గానీ, ఆర్అండ్బీ అధికారులు గానీ ఉదాసీనంగా వ్యవహరిస్తుండటం పట్ల ప్రజల్లో విస్మయం వ్యక్తం అవుతుంది. ఫ్లెక్సీల కోసం రోడ్లను తూట్లు పొడవడంపై అధికారులు స్పదించాల్సి ఉంది.