ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
సాక్షి, యాదాద్రి : గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్యనభ్యసించిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నిరుద్యోగుల కోసం ఈనెల19న సూర్యాపేట జిల్లా కోదాడలోని కేఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలయ్య, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ. భాస్కర్రావు, ఎస్పీ అక్షాంశ్యాదవ్, జిల్లా ఉన్నతాధికారులు, విద్యాసంస్థల ప్రతినిధులతో కలిసి జాబ్ మేళాపై మంత్రి సమీక్షించి మాట్లాడారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫాక్స్కాన్, ఐటీసీ, అపోలో, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి 300 ప్రముఖ కంపెనీలు ఈ మేళాకు వస్తున్నాయని వివరించారు. దాదాపు 15 వేల నుంచి 20 వేల మంది నిరుద్యోగులు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇందులో కనీసం 3 వేల నుంచి 4 వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జాబ్ మేళా ప్రారంభోత్సవానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరవుతారని, ఎంపికై న అభ్యర్థులకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా సాయంత్రం ఆఫర్ లెటర్లు అందజేస్తామని చెప్పారు.
మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు
భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలయ్య మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి ఉత్తమ్కు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా చూస్తామన్నారు. గంధమల్ల రిజర్వాయర్ కోసం రూ. 530 కోట్ల సవరించిన అంచనాలతో సీఎం శంకుస్థాపన చేశారని, తాజాగా రూ. 130 కోట్లు విడుదల చేసి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. బస్వాపూర్ రిజర్వాయర్కు రూ. 206 కోట్లు కేటాయించామని, 5.5 టీఎంసీల నీటిని నిల్వ చేసి ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో ఆయకట్టును సస్యశ్యామలం చేస్తామన్నారు. బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల పునరుద్ధరణకు రూ. 480 కోట్లు విడుదల చేశామన్నారు. పేద ప్రజలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.42 కోట్ల మంది లబ్ధిదారుల కోసం 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులను ముద్రించి సిద్ధం చేశామని, త్వరలోనే స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేస్తామని తెలిపారు.
ఫ 19న కోదాడలో మెగా జాబ్ మేళా
ఫ హాజరుకానున్న 300 కంపెనీలు
ఫ ఎన్ని ఇబ్బందులెదురైనా సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కొరత రానివ్వం
ఫ కలెక్టరేట్లో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమీక్ష


