భూదాన్పోచంపల్లి : పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన మేకల ప్రభోద్రెడ్డి (53) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐర్లాండ్ దేశంలో ఈ నెల 9న అనారోగ్యంతో మృతిచెందగా, 11 రోజుల తరువాత సోమవారం ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. మేకల ప్రభోద్రెడ్డి ఉన్నత చదువులు చదివి 20 సంవత్సరాల క్రితం ఐర్లాండ్ దేశానికి వెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కుటుబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటున్నారు. ఇటీవల అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఐర్లాండ్లోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఈ నెల 9న మృతిచెందారు. ఆయన మృతదేహాన్ని అక్కడే ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచారు. ప్రభోద్రెడ్డి మృతదేహాన్ని కుటుంబసభ్యులు సోమవారం స్వగ్రామమైన శివారెడ్డిగూడెంకు తరలించి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రభోద్రెడ్డి సొంతూరులో ఎనిమిదేళ్లుగా సొంత డబ్బులతో హెల్త్క్యాంపులు నిర్వహించారు. ఆయన చేసిన సామాజిక సేవలను గ్రామస్తులు గుర్తుచేసుకొని విలపించారు. కాగా ప్రభోద్రెడ్డి మృతదేహాన్ని మాజీ ఎంపీపీ ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్రెడ్డి, సర్పంచ్ బొక్క మల్లారెడ్డి, ఉపసర్పంచ్ చిలుకల సంతోష్, మాజీ సర్పంచ్ పీసర్ల మంజుల మహిపాల్రెడ్డి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు మందాడి సుమతి, 1989 స్థానిక జెడ్పీహెచ్ఎస్ ఎస్సెస్సీ పూర్వ విద్యార్థులు సందర్శించి నివాళులర్పించారు.
11 రోజుల తరువాత స్వగ్రామానికి
చేరిన మృతదేహం


