ఆలేరు: లక్ష్యం మేరకు పన్నుల వసూలుపై దృష్టిసారించాలని ఆలేరు మున్సిపల్ చైర్పర్సన్ బీజనబాలమణిభాస్కర్కు కమిషనర్, డైరెక్టర్ మున్సిపల్ అడ్మిస్ట్రేటివ్ (సీడీఎంఏ) శ్రీదేవి సూచించారు. సోమవారం చైర్పర్సన్ బాలమణి సీడీఎంఏను హైదరాబాద్లోని తన కార్యాలయంలో కలిశారు. ఈసందర్భంగా మున్సిపాలిటీలో ముఖ్యఅధికారుల కొరత, రూ.15కోట్ల నగరాభివృద్ధి, మరో రూ.15కోట్ల టీయూఎఫ్ఐడీసీ ఇలా మొత్తం రూ.30కోట్ల నిధులతో పట్టణంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులు త్వరగా మొదలయ్యేలా చూడాలని సీడీఎంఏను చైర్పర్సన్ కోరారు. ఏఈ, టీపీఓ, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితర ముఖ్య అధికారుల పోస్టులన్నీ ఖాళీగా ఉండటం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను చైర్పర్సన్ ఆమెకు వివరించారు. అనంతరం సీడీఎంఏ మాట్లాడుతూ ఆస్తి, కుళాయి తదితర పన్నుల వసూలు వందశాతం వసూలు చేసేలా చూడాలని చైర్పర్సన్కు సూచించారు. ప్రభుత్వ గ్రాంట్లతోపాటు మున్సిపాలిటీలు ఆర్థికంగా బలోపేతం కావడానికి పన్నుల రూపంలో సొంత నిధులను సమకూర్చుకోవాలన్నారు. పరిపాలనపై పూర్తి పట్టుసాధించినప్పుడు పురోగతి సాధ్యమవుతుందని సీడీఎంఏ పేర్కొన్నారు.అనంతరం చైర్పర్సన్ పలు శాఖల అధికారుల నియామకం కోసం ఈఎన్సీ, అడిషనల్ డీటీసీపీలను కలిసి వినతి పత్రాలు అందజేశారు.


