ఆలేరురూరల్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణనలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని, మాదిగల జనాభాను తగ్గించి చూపించారని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం ఆలేరు మండలంలోని కొలనుపాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్రెడ్డికి మాదిగలపై చిత్తశుద్ధి ఉంటే కులగణన సర్వే బయటపెట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఒక్కరికి కూడా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయలేదన్నారు. రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన మాదిగలను తక్కువ చూపించి అసెంబ్లీ, పార్టమెంట్ సీట్లు రాకుండా రేవంత్రెడ్డి ప్రభుత్వం అడ్డుపడుతుందన్నారు. కుల గణన సమాచారాన్ని తారుమారు చేస్తే సామాజిక న్యాయానికి ఆటంకం కలిగిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కందుల రామన్, ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకుడు మోత్కూరి ఐలయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు సైదాపురం సురేష్, గందమల్ల స్వామి పాల్గొన్నారు.


