యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తురాలు పోగొట్టుకున్న బంగారు నల్లపూసల పుస్తెలను ఎస్పీఎఫ్ పోలీసులు గుర్తించి తిరిగి ఆమెకు అందజేశారు. ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా గొర్లనోనిబావికి చెందిన కావలి మంగమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరీశుడిని దర్శించుకునేందుకు శుక్రవారం వచ్చింది. స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న సమయంలో ఆమె బంగారు నల్లపూసల పుస్తెలు పోగొట్టుకుంది. వెంటనే మంగమ్మ సమీపంలోని ఎస్పీఎఫ్ సిబ్బందికి, ఆలయ సిబ్బందికి ఫిర్యాదు చేయగా.. ఎస్పీఎఫ్ సిబ్బంది సీసీ కెమెరాల సాయంతో పుస్తెలు దొరికిన వ్యక్తులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ ఈఓ నవీన్కుమార్, ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కె. శేషగిరిరావు, ఎస్ఐ సీహెచ్. రవి సమక్షంలో మంగమ్మకు బంగారు పుస్తెలు అందజేశారు.


