భువనగిరిటౌన్ : తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్రెడ్డి వెల్లడించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉద్యోగ సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన తెలియజేయాలని కోరారు. 2023 నుంచి పెండింగ్లో ఉన్న రెండవ పీఆర్సీని వెంటనే అమలు చేయాలనిడిమాండ్ చేశారు. సమావేశంలో టీఎన్జీఓ అధ్యక్షుడు భగత్, పీఆర్టీయూ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, యూటీఎఫ్ అధ్యక్షుడు యాదయ్య, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షుడు జగన్మోహన్ ప్రసాద్ పాల్గొన్నారు.


