నార్కట్పల్లి : ఆడుకోవటానికి కారులోకి వెళ్లిన చిన్నారి వాహనం డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక మృతిచెందింది. ఈ సంఘటన మంగళవారం నార్కట్పల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లికి చెందిన పేర్ని సతీష్, గాయత్రిల కుమార్తె పేర్ని శరణ్య (5) మంగళవారం ఉదయం తన ఇంటి వద్ద ఉన్న చిన్నారులతో కలిసి ఆడుకుంటుంది. ఈక్రమంలో శరణ్య తన ఇంటి ఎదుట నిలిపి ఉంచిన కారులోకి వెళ్లింది. ఎవరూ గమనించకపోవడం, వాహనం డోర్లు, విండోస్ లాక్ కావడంతో అందులోనే ఉండిపోయింది. ఆడుకోవడానికి వెళ్లిన తమ కుమార్తె ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో శరణ్య తల్లి గాయత్రి, కుటుంబసభ్యులు చుట్టుపక్కల ఇళ్లలో వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో చివరకు వారి ఇంటి ఎదుట నిలిపి ఉంచిన కారులో చూడగా వాహనం వెనుక సీటులో అపస్మారకస్థితిలో పడి ఉంది. వెంటనే కారు డోర్లు తీసి చిన్నారిని నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శరణ్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి తల్లి గాయత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు.
● ఆడుకోవడానికి కారులోకి వెళ్లిన చిన్నారి
● డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక మృతి


