ఇందిరమ్మ ఇళ్ల వివరాలు
ఆలేరు రూరల్ : పెరిగిన స్టీల్, సిమెంట్ ధరలతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే వంట నూనెలు, పప్పు దినుసుల ధరలు మండుతుంటే.. తాజాగా స్టీల్, సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఒక్కో ఇంటి నిర్మాణానికి అదనంగా రూ.27వేల పైచిలుకు భారం పడుతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధరలు పెరిగాయి ఇలా..
అధికారుల లెక్కల ప్రకారం ఒక్కో ఇంటి నిర్మాణానికి రెండున్నర టన్నుల స్టీల్, 200 బస్తాల సిమెంట్ అవసరం ఉంటుంది. ఇరవై రోజుల క్రితం వరకు టన్ను స్టీల్ ధర రూ.63 వేలుకు ఉండగా ప్రస్తుతం రూ.70 వేలకు చేరింది. ఈ లెక్కన టన్నుకు రూ.7వేలు పెరిగింది. రెండున్నర టన్నులకు రూ.17,500 అదనపు భారం పడుతోంది. అలాగే సిమెంట్ బస్తా ధర ఇరవై రోజుల క్రితం రూ.280 ఉండగా.. ప్రస్తుతం రూ.330కి చేరుకుంది. బస్తాకు రూ.50 పెరిగింది. పెరిగిన ధరతో సిమెంట్ రూ.10వేలు అదనపు భారం పడుతుంది.
రూ.23.14 కోట్ల అదనపు భారం
ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థికసాయం చేస్తుండగా లబ్ధిదారులు మరికొంత డబ్బులు కలిపి ఇళ్లను నిర్మించుకుంటున్నారు. కానీ పెరిగిన స్టీల్, సిమెంట్ ధరలతో ఒక్కో ఇంటిపై రూ.27,500 అదనపు భారం పడుతుంది. ఈ ప్రకారంగా జిల్లాకు మంజూరైన 8,418 ఇళ్లకు సంబంధించి ఏకంగా రూ.23.14కోట్ల అదనపు భారం పడనుంది. దీంతో పెరిగిన ధరలతో ఇళ్లు నిర్మించడం సాధ్యం కాదని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. మరికొందరు లబ్ధిదారులు వ్యాపారుల వద్ద, బంధువుల వద్ద వడ్డీలకు అప్పుతెచ్చి ఇళ్లు నిర్మించుకుంటున్నామని చెబుతున్నారు.
ఆవేదనలో బిల్డర్లు, కాంట్రాక్టర్లు
ఇప్పటికే ప్రభుత్వ నిర్మాణ పనులను చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లు, అపార్ట్మెంట్లు, ఇళ్ల నిర్మాణాలు చేసే బిల్డర్లు సైతం స్టీల్, సిమెంట్ ధరలు పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలతో తాము నష్టాల్లో కూరుకుపోయి అప్పుల పాలు కావడం ఖాయమని బిల్డర్లు ఆవేదన చెందుతున్నారు.
ఫ భారీగా పెరిగిన స్టీల్, సిమెంట్ రేట్లు
ఫ టన్ను స్టీల్పై రూ.7వేలు,
బస్తా సిమెంట్కు రూ.50 పెరుగుదల
ఫ ఒక్కో ఇంటిపై రూ.27 వేల
అదనపు భారం
ఫ లబోదిబోమంటున్న లబ్ధిదారులు
జిల్లాకు మంజూరైనవి 9,618 నిర్మాణాలు ప్రాంభించినవి 8,418 పూర్తయినవి 1,264 వివిధ దశలో ఉన్నవి 7,154


