యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వారాంతపు సెలవు కావడంతో భక్తులు స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. ఆలయ క్యూలైన్లు, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, క్యూకాంప్లెక్స్ ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు. 35వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.40,34,619 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.
యాదగిరీశుడి సేవలో
సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ
యాదగిరీశుడిని సీఎం రేవంత్రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ భవానీ శంకర్ లడ్డూ ప్రసాదం అందజేశారు.


