ఆంధ్రా ప్రాంతం నుంచి ధాన్యం రాకుండా అడ్డుకునేందుకు పౌర సరఫరాల, పోలీసు, ట్రాన్స్పోర్ట్ శాఖల ఆధ్వర్యంలో శుక్రవారం మిర్యాలగూడ మండల పరిధిలోని ఆలగడప టోల్ గేట్ వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ధాన్యం సేకరణ ప్రారంభమై వడ్లు మిల్లులకు రవాణా అవుతున్న సందర్భంగా ఆంధ్రా నుంచి ధాన్యం లారీలు తెలంగాణలోకి వస్తున్నాయనే సమాచారం మేరకు చెక్పోస్టులను ఏర్పాటు చేసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. శుక్రవారం సుమారు 70 లారీల మేరకు తనిఖీ చేయగా ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది ఏ మిల్లులకు వెళ్తుంది, రైతుల పేర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. కోదాడ, సూర్యాపేట, గరిడేపల్లి తదితర ప్రాంతాలకు చెందిన రైతుల పేరిట వేబిల్లులతో రావడంతో వాటిని వదలివేశారు. ఈ తనిఖీల్లో పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్, ఎంవీఐ చంద్రశేఖర్, రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య, ఆర్.సైదులు పాల్గొన్నారు.


