
అంగన్వాడీల్లో 324 ఖాళీలు
నాలుగేళ్లుగా భర్తీ కాని పోస్టులు
● సిబ్బంది కొరతతో
మూతపడుతున్న కేంద్రాలు
● జిల్లాలో 28 సెంటర్లు మూసివేత
ఆత్మకూరు(ఎం): గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అండగా నిలుస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనేక చోట్ల ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. కొన్ని చోట్ల సమీప గ్రామాల కేంద్రాల టీచర్లను ఇంచార్జ్లుగా నియమించగా, మరికొన్ని చోట్ల తెరిచేవారు లేక మూతపడ్డాయి. జిల్లాలోని నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 841 అంగన్వాడీ కేంద్రాలు.. వాటి పరిధిలో టీచర్ 58, ఆయా పోస్టులు 266 ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరత వల్ల 28 కేంద్రాలు మూతపడ్డాయి.
ఖాళీ పోస్టులను సుదీర్ఘకాలంగా భర్తీ చేయకపోవడంతో పలు గ్రామాల్లో కేంద్రాలు తెరిచేవారు లేకుండాపోయారు. జిల్లావ్యాప్తంగా 28 కేంద్రాలు మూత పడటంతో లబ్ధిదారులకు పౌష్టికాహారం అందడం లేదు.
రామన్నపేట ప్రాజెక్టు పరిధిలో..
రామన్నపేట ప్రాజెక్టు పరిధిలో 219 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. టీచర్ 16, ఆయా పోస్టులు 97 ఖాళీ ఉన్నాయి. సిబ్బంది లేమితో 10 కేంద్రాలు మూతపడ్డాయి.
భువనగిరి పరిధిలో..
భువనగిరి పరిధిలో 267 కేంద్రాలు నడుస్తున్నాయి. టీచర్ 4, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్లు, ఆయాలు లేనిచోట ఇంచార్జ్లతో నడిపిస్తున్నారు.
మోత్కూరు..
మోత్కూరు ప్రాజెక్టు పరిధిలో 136 కేంద్రాలు నడుస్తున్నాయి. టీచర్లు 32, ఆయా పోస్టులు 63 ఖాళీ ఉన్నాయి. టీచర్లు, ఆయాలు లేకపోవడంతో 15 కేంద్రాలు మూతపడ్డాయి. బాలింతలు 285 మంది, గర్భిణులు 359, చిన్నారులు 2,934 మంది ఉన్నారు. ఆలేరు..
ఆలేరు ప్రాజెక్ట్ పరిధిలో 219 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. టీ చర్లు 6, ఆయా పోస్టులు 56 ఖాళీ ఉన్నాయి. 3 కేంద్రాలు మూతపడ్డాయి. బాలింతలు 1,061, గర్భిణులు 1,031, చిన్నారులు 10,566 మంది నమోదై ఉన్నారు.
ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్పేట అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు 16, గర్భిణులు నలుగురు ఉండేవారు. కేంద్రంలో పని చేస్తున్న ఆయా అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె స్థానంలో మరొకరిని నియమించకపోవడంతో రెండేళ్ల నుంచి అంగన్వాడీ టీచర్ మంగమ్మ కేంద్రం నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. పిల్లలకు చదువు చెప్పడంతో పాటు కేంద్రాన్ని ఊడ్చటం, పిల్లలకు వంట చేయటం, పౌష్టికాహారం పంపిణీ వంటి పనులన్నీ తానే చేస్తుంది. అంగన్వాడీ కేంద్రం పరిసరాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉంది. పిల్లలకు భద్రత కల్పించడానికి స్వయంగా నెలకు రూ. 600 చెల్లిస్తూ ప్రైవేట్ వ్యక్తిని నియమించుకుంది.
ఆత్మకూరు(ఎం) మండలం పోతిరెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రంలో 15 మంది లబ్ధిదారులు ఉండేవారు. అనారోగ్యంతో అంగన్వాడీ టీచర్, వృద్ధాప్యంతో ఆయా మృతి చెందారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించలేదు. దీంతో మోదుబావిగూడెం అంగన్వాడీ కేంద్రం టీచర్ను ఇంచార్జ్గా నియమించారు. ఆమె పది రోజులకు ఒకసారి పోతిరెడ్డిపల్లికి వచ్చి లబ్ధిదారులకు పౌష్టికాహారం అందజేసి వెళ్తుంది. మిగతా రోజుల్లో కేంద్రం మూసి ఉంటుంది.
త్వరలోనే భర్తీ చేస్తాం
అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వేస్తాం. సిబ్బంది లేనిచోట లబ్ధిదారులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యామ్నా ఏర్పాట్లు చేశాం. పక్క గ్రామం అంగన్వాడీ టీచర్తో పౌష్టికాహారం అందజేస్తున్నాం. ఖాళీల వివరాలను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేశాం.
– నరసింహారావు, ఐసీడీఎస్ పీడీ

అంగన్వాడీల్లో 324 ఖాళీలు