
మోత్కూరు ఎస్ఐ హెడ్క్వార్టర్కు అటాచ్
మోత్కూరు : క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మోత్కూరు ఎస్ఐ డి.నాగరాజును అంబర్పేట పోలీస్ హెడ్క్వార్టర్కు అటాచ్ చేస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్కు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముశిపట్ల గ్రామంలో ఒక యువకుడు సీఎం రేవంత్రెడ్డి, అధికార పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ గ్రామ వాట్సాప్ గ్రూపులో పోస్టులు పెట్టడం, రాగిబావి గ్రామంలో భూ తగాదాలో ఇరు వర్గాల విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరించడంపై ఎస్ఐ నాగరాజు విఫలమయ్యాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఆయనను పోలీస్ హెడ్క్వార్టర్కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐని హెడ్ క్వార్టర్కు అటాచ్ చేసిన విషయం వాస్తవమేనని రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు విలేకరులకు తెలిపారు.
రూ.1.50 లక్షల విలువైన పట్టు చీరలు బహూకరణ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి భూదాన్పోచంపల్లికి చెందిన చేనేత వ్యాపారి బొడ్డు శ్రీధర్, నవీన్లు రూ.1.50లక్షలు విలువ చేసే కంచి పట్టు చీరలు బహూకరించారు. శనివారం స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ముఖ మండపంలోని సువర్ణ పుష్పార్చన మూర్తుల చెంత ఆలయ అధికారి గజవెల్లి రఘుకు చీరలను అందజేశారు.
సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చాలి
భువనగిరి : ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సెమి రెస్సిడెన్షియల్ స్కూల్స్గా మార్చడంతో పాటు పర్యవేక్షణ అధికారుల పోస్టులను ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలని టీఎస్యూటీఎప్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం భువనగిరిలోని ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్డ్ సంఘం భవనంలో జరిగిన టీఎస్ యూటీఎప్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న గురుకులాలను డే పాఠశాలలుగా మార్చడం సరికాదన్నారు. ఫ్రీ ప్రైమరీ తరగతులను ప్రాథమిక పాఠశాలకు అనుసంధానం చేసి తరగతికి ఒక గది ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని పేర్కొన్నారు. దీని వల్ల విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మకమైన విద్య అందుతుందన్నారు. వెంటనే పీఆర్సీని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ముక్కెర్ల యాదయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర అడిట్ కమిటీ కన్వీనర్ యాకయ్య, ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు, ఉపాధ్యక్షులు వెంకటాచారి, మమత, కోశాదికారి ముత్యాలు, నాయకులు దొడ్డి స్వామి, రవికుమార్, కరుణాకర్, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన బాధ్యులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరి : దేశంలో అత్యున్నతమైన పద్మ పురస్కారాలకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమలు మొదలైన రంగాల్లోవిశిష్ట సేవలు అందించి విజయాలు సాధించిన వారికి వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం రోజు అవార్డులు అందజేయనున్నారు. 2026 సంవత్సరానికి ఇచ్చే పద్మ పురస్కారాల కోసం నామినేషన్లు, సిఫారసులను రాష్ట్రపతి పురస్కార్ పోర్టల్ awards.gov.in ద్వారా జులై 31లోగా పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు padmaawards. gov.inలో ఉన్నాయని అధికారులు తెలిపారు.

మోత్కూరు ఎస్ఐ హెడ్క్వార్టర్కు అటాచ్