జంగారెడ్డిగూడెం: పుట్టినరోజు వేడుకల కోసం ఇంటికి వెళ్తున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన జంగారెడ్డిగూడెం మండలంలో చోటుచేసుకుంది. చల్లవారిగూడెంకు చెందిన అబ్బ దాసరి వంశీ (30)ని శనివారం రాత్రి తాడువాయి గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. తాడువాయి గ్రామ శివారుకు చేరుకోగానే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్ఐ వీరప్రసాద్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఏడాది క్రితం మేనమామ కుమార్తెను వివాహం చేసుకున్న వంశీ భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. పుట్టబోయే బిడ్డ ముఖం చూడకముందే వంశీ మృతి చెందడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. తల్లిదండ్రులు, భార్య కావ్య కన్నీరుమున్నీరయ్యారు.
కొయ్యలగూడెం: బయ్యన్నగూడెం గ్రామంలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ వి.చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. మంగిశెట్టిగూడెం గ్రామానికి చెందిన సింగంశెట్టి నాగరాజు (35) బయ్యన్నగూడెంకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. దంపతుల మధ్య తరచూ కలహాలు జరుగుతుండటంతో, నాగరాజు భార్య గత మూడేళ్లుగా పుట్టింటిలోనే ఉంటోంది. ఆదివారం నాగరాజు తన భార్య, పిల్లలను కలిసేందుకు బయ్యన్నగూడెంలోని అత్తవారి ఇంటికి వెళ్లాడు. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అతని భార్య సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


