ఉత్సాహంగా బాస్కెట్బాల్ పోటీలు
నూజివీడు: స్థానిక డీఏఆర్ కళాశాలలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన శ్రీ రాజా వెంకటాద్రి అప్పారావు బహదూర్ 49వ స్మారక పురుషుల, మహిళల జాతీయ బాస్కెట్ బాల్ పోటీలు బుధవారం రాత్రితో ముగిశాయి. పురుషుల విభాగంలో చైన్నె ఎస్ఆర్ఎం జట్టు, మహిళల విభాగంలో కేఎల్యూ జట్టు విజేతలుగా నిలిచాయి. పురుషుల, మహిళల సెమీస్, ఫైనల్ మ్యాచ్లతో పాటు రెండు విభాగాల్లో 3, 4స్థానాలకు పోటీలు నిర్వహించారు. సెమీఫైనల్ పోటీల్లో భాగంగా మహిళల విభాగంలో తొలిసెమీఫైనల్ ఏలూరు జట్టు ఏబీఏ నూజివీడుపై 34–17 స్కోర్తోనూ, రెండో సెమీఫైనల్ మ్యాచ్లో కేఎల్యూ జట్టు పల్నాడు జట్టుపై 57–33 స్కోర్తోను గెలుపొంది ఫైనల్లోకి ప్రవేశించాయి. మూడు, నాలుగు స్థానాల్లో పల్నాడు జట్టు, ఏబీఏ నూజివీడు నిలిచాయి. పురుషుల విభాగంలో తొలి సెమీఫైనల్ మ్యాచ్లో చైన్నె ఎస్ఆర్ఎం జట్టు స్వస్తిక్ హైదరాబాద్ జట్టుపై 66–34 స్కోర్తోనూ, రెండో సెమీఫైనల్ మ్యాచ్లో సదరన్ కమాండ్ పూణే జట్టు చిత్తూరు జట్టు పై 89–64 తేడాతో గెలవడంతో చైన్నె ఎస్ఆర్ఎం, సదరన్ కమాండ్ లు ఫైనల్కు చేరాయి. పురుషుల విభాగంలో మూడు, నాలుగు స్థానాల్లో స్వస్తిక్ హైదరాబాద్ జట్టు చిత్తూరు జట్టు నిలిచాయి.
పోటాపోటీగా ఫైనల్ మ్యాచ్లు
పురుషుల ఫైనల్ మ్యాచ్ చైన్నె ఎస్ఆర్ఎం, సదరన్ కమాండ్ పుణే జట్ల మధ్య ఆద్యంతం పోటాపోటీగా సాగినప్పటికీ ఎస్ఆర్ఎం జట్టు విజేతగా నిలిచింది. ఎస్ఆర్ఎం జట్టు ఆట ప్రారంభం నుంచి ఆధిక్యతను కనబరిచి చివరకు 49–34స్కోర్ తేడాతో ఎస్ఆర్ఎం గెలుపొంది విజేతగా నిలిచింది. మహిళల ఫైనల్మ్యాచ్లో ప్రారంభం నుంచి కేఎల్యూ జట్టు ఏలూరు జట్టుపై ఆధిక్యతను కనబరిచింది. అయితే ద్వితియార్థంలో ఏలూరు జట్టు అనూహ్యంగా పుంజుకొని గట్టి పోటీనిచ్చింది. చివరకు కేఎల్యూ జట్టు ఏలూరు జట్టుపై 61–48 స్కోర్ తో గెలుపొంది విజేతగా నిలిచింది.
బాస్కెట్బాల్కు ఆదరణ అమోఘం
49 ఏళ్లుగా జాతీయ స్థాయి బాస్కెట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడాన్ని బట్టే నూజివీడులో బాస్కెట్బాల్కు ఉన్న ఆదరణ ఎలా ఉందో చెప్పవచ్చని మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పేర్కొన్నారు. బాస్కెట్బాల్ పోటీల బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథ/గా హాజరైన ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు కృషి, పట్టుదలతో ఆడి తమ ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు సీడ్స్ డైరెక్టర్ మండవ ఆశాప్రియ, కిమ్స్ డైరెక్టర్ బొల్లినేని కృష్ణయ్య, ఏబీఏ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కే రమేష్బాబు, కృష్ణాజిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు జీఎస్సీ బోస్, మిర్యాల కృష్ణకిషోర్, ఫెసిలిటేటర్ అంజాద్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.
పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన చైన్నె ఎస్ఆర్ఎం జట్టుకు
షీల్డును అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
మహిళల విభాగంలో విజేతగా నిలిచిన కేఎల్యూ జట్టుకు షీల్డును అందిస్తున్న నూజివీడు సీడ్స్ డైరెక్టర్ మండవ ఆశాప్రియ
ఉత్సాహంగా బాస్కెట్బాల్ పోటీలు


