
విశ్వబ్రాహ్మణ సంఘానికి ఎమ్మెల్సీ కేటాయించాలి
ఆకివీడు: రాష్ట్రంలో స్వర్ణకార వృత్తి అగమ్యగోచరంగా ఉందని, వృత్తిదారులు పనులు లేక రోధిస్తున్నారని స్వర్ణకార సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల పాపాయాచార్యులు ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక రైస్మిల్లర్స్ భవనంలో ఆదివారం ఉమ్మడి జిల్లా స్వర్ణకార సంఘం విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ స్వర్ణకారులు రాజకీయంగా ఎదగాలన్నారు. విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విశ్వబ్రాహ్మణ, స్వర్ణకార కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రూ.100 కోట్లు నిధులు కేటాయించాలని కోరారు. బ్యాంకుల్లో అప్రైజర్లుగా అనుభవం కలిగిన స్వర్ణకారుల్నే నియమించాలని డిమాండ్చేశారు. తిరుమల తిరుపతి, ఇతర దేవస్థానాల్లో ట్రస్టుబోర్డు సభ్యులుగా విశ్వబ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. అన్ని రంగాల్లో స్వర్ణకారులు ముందుండాలని, వృత్తి నైపుణ్యత సాధించాలన్నారు. ప్రభుత్వం వృత్తిదారులకు పనిముట్లు అందజేసేకన్నా, పని కల్పించడంలో ప్రాధాన్యతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాల ప్రాధాన్యతను పెంచాలన్నారు. మట్టి, మాంగళ్యం వంటివి స్వర్ణకారుల ద్వారానే తయారుచేయించాలన్నారు. ఉమ్మడి జిల్లా స్వర్ణకార సంఘ అధ్యక్షుడు పట్నాల శేషగిరిరావు మాట్లాడుతూ స్వర్ణకారుల్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కార్పొరేట్ సంస్థల రంగప్రవేశంతో స్వర్ణకారులకు పనులు లేకుండా పోయాయని వాపోయారు. రెడీమేడ్ ఆభరణాలు రాజ్యమేలడంతో స్వర్ణకారులు చితికిపోతున్నారన్నారు. బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన అంటుతుంటే వృత్తిదారులు మాత్రం పాతాళానికి వెళ్తున్నారని వాపోయారు. సమావేశంలో సీనియర్ స్వర్ణకారుల్ని, విశ్వబ్రాహ్మణుల్ని సత్కరించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు కీర్తి శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి నల్లగొండ వెంకట రామకృష్ణ, లక్కోజు వెంకట దుర్గా నాగేశ్వరరావు, దేవు వెంకటేశ్వర ప్రసాద్, పట్నాల సత్యనారాయణ, లక్కోజు రాజగోపాలాచార్యులు, పోడుగు రామాచార్యులు, గొల్తి వరప్రసాద్, కోరుమిల్లి సుబ్బారావు, నక్కా చైతన్య శ్రీణివాస్, తుపాకుల సోమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీనియర్లను, జిల్లా కమిటీని సత్కరించారు.
ఉమ్మడి జిల్లా స్వర్ణకార సంఘం డిమాండ్