
మున్సిపల్ కార్మికులకు ‘తల్లికి వందనం’ వర్తింపజేయాలి
భీమవరం: భీమవరం మున్సిపల్ కార్మికులందరికీ తల్లికి వందనం పథకం వర్తింప చేయాలని, ఇంజినీరింగ్ కార్మికుల కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు బి.వాసుదేవరావు మాట్లాడుతూ మున్సిపాలిటీని నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న కార్మికులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. తల్లికి వందనం పథకం పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు వర్తింప చేయకపోవడం దారుణమన్నారు. అరకొర జీతాలతో పనిచేస్తున్న స్కీం కార్మికులందరిని తల్లికి వందనం పథకానికి దూరం చేశారని, 300 యూనిట్లు విద్యుత్ వినియోగం, రూ.20 వేల జీతం సాకుతో పథకాన్ని నిలుపుదల చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఆందోళన చేపడతారని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రం మున్సిపల్ మేనేజర్కు అందచేశారు. ధర్నాలో యూనియన్ నాయకులు నీలాపు రాజు, ఎస్కే నాగూర్, బంగారు వరలక్ష్మి, చిన్న పెద్దిరాజు, మామిడి శివ, పళ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.