
వైఎస్ జగన్ను కలిసిన మురళీకృష్ణంరాజు
సాక్షి, భీమవరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం తాడేపల్లిలో పార్టీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ పరిధిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేసి ప్రజలను మోసగిస్తున్న తీరు తదితర అంశాలపై అధినేతతో చర్చించినట్టు మురళీకృష్ణంరాజు తెలిపారు.
కొల్లేరు వాసుల నుంచి వినతిపత్రాల స్వీకరణ
ఏలూరు(మెట్రో): కేంద్ర సాధికారిత కమిటీ కొల్లేరు ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటన అనంతరం మంగళవారం రాత్రి ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో దెందులూరు, ఏలూరు, ఉంగుటూరు మండలాలకు చెందిన పలువురు రైతులు, కొల్లేరు వాసులు, పర్యావరణవేత్తలు అందజేసిన వినతిపత్రాలను స్వీకరించింది. కార్యక్రమంలో కమిటీ మెంబరు కార్యదర్శులు డా.జె.ఆర్.భట్, జి.భానుమతి, కమిటీ సభ్యులు సునీల్ లిమాయే, ప్రకాష్ చంద్రభట్లతో పాటు ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు రక్షణ కరువు
ఏలూరు టౌన్: రాష్ట్రంలో మహిళలకు, యువతులకు రక్షణ లేకుండా పోయిందని, ఏకంగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే మహిళలపై దౌర్జన్యాలు, దాడులు జరుగు తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి తెలిపారు. ఒక మహిళ హోమంత్రిగా ఉంటున్నా మహిళలకు రక్షణ లేకపోవటం సిగ్గుచేటని, ఒక మహిళను పట్టపగలు నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి చెట్టుకు కట్టేసి కొట్టడం దారుణమన్నారు. ఇలాంటి దాడులు, దౌర్జన్యాలపై ప్రభుత్వం స్పందించలేదని, కనీసం దోషులను అరెస్ట్ చేయలేదని, ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళల కోసం శక్తి యాప్ పెట్టాం, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పుకునే కూటమి ప్రభుత్వం మహిళపై దాడికి పాల్పడినా ఏ విధమైన చర్యలు తీసుకోకపోవటం బాధాకరమని తెలిపారు.
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు
భీమవరం: జిల్లాకు చెందిన పలువురిని రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. రాష్ట్ర ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్గా సాలా నరసయ్య (పాలకొల్లు), ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీగా బి.విజయరాం(నరసాపురం), ఎస్టీ సెల్ సెక్రటరీగా మేకల ఏడుకొండలు(తాడేపల్లిగూడెం), రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా పరిమి వెంకటేశ్వరరావు (తాడేపల్లిగూడెం), రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం సెక్రటరీగా ఎస్ఎస్ ప్రసాద్(తాడేపల్లిగూడెం), రాష్ట్ర అంగన్వాడీ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా మద్దా చంద్రకళ(పాలకొల్లు), రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ సెక్రటరీగా మారిశెట్టి శేషగిరిరావు(తణుకు), రాష్ట్ర కల్చరల్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా ఆకుల పాండుస్వామి(తణుకు), రాష్ట్ర వీవర్స్ వింగ్ జనరల్ సెక్రటరీగా ఎస్.మల్లిఖార్జునరావు (పాలకొల్లు) నియమితులయ్యారు.
డీఎస్సీ పరీక్షకు 94 శాతం హాజరు
భీమవరం: జిల్లాలోని 5 పరీక్షా కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షకు 94.66 శాతం అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ చెప్పారు. ఉదయం నిర్వహించిన పరీక్షకు 636 మందికి 615 మంది హాజరుకాగా మధ్యాహ్నం పరీక్షకు 581 మందికి 537 మంది హాజరయ్యారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని నారాయణ తెలిపారు.