ధాన్యం.. రైతు దైన్యం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం.. రైతు దైన్యం

Jun 17 2025 7:01 AM | Updated on Jun 17 2025 7:01 AM

ధాన్య

ధాన్యం.. రైతు దైన్యం

సాక్షి, భీమవరం : జిల్లాలోని 2.2 లక్షల ఎకరాల్లో దాళ్వా సాగు చేయగా 9.25 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఓపెన్‌ మార్కెట్‌లో విక్రయాలు, నిల్వ నిమిత్తం 1.50 లక్షల టన్నులు మినహాయించగా, 7.75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు సిఫార్సు చేసింది. కాగా ఆరు లక్షల టన్నుల సేకరణకు మాత్రమే తొలుత కూటమి ప్రభుత్వం సివిల్‌ సప్లయీస్‌ అధికారులకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ తీరుపై రైతుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో తర్వాత మరో 1.5 లక్షల టన్నులు సేకరించేందుకు అనుమతినిచ్చింది.

రూ.290 కోట్ల బకాయిలు

ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం చెబుతుండగా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. రబీ సీజన్‌లో జిల్లాలో దాదాపు 77 వేల మంది రైతుల నుంచి రూ.1,650 కోట్లు విలువైన 7.17 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటిలో రూ.1,360 కోట్లు రైతుల ఖాతాలకు జమచేసింది. 18 వేల మందికి పైగా రైతులకు సంబంధించి రూ.290 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. దాదాపు నెల రోజులుగా ప్రభుత్వం ధాన్యం సొమ్ముల చెల్లింపులను నిలిపివేసినట్టు తెలుస్తోంది. సాగు చివరిలో ప్రతికూల వాతావరణం ఇబ్బంది పెట్టినా వ్యయప్రయాసలకోర్చి ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయిస్తే సొమ్ములివ్వకుండా ఇబ్బంది పెడుతోందని రైతులు వాపోతున్నారు. గత నెలలో జిల్లాలో పర్యటించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, రాష్ట్ర పర్యాటక, గృహనిర్మాణశాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌లు మాట్లాడుతూ ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలకు నగదు జమచేస్తున్నట్టు తెలపగా అప్పటికే రూ.కోట్లల్లో ధాన్యం బకాయిలు ఉన్నట్టు సమాచారం. రైతులకు చెల్లించాల్సిన సొమ్ములను ప్రభుత్వం వేరే అవసరాల నిమిత్తం దారి మళ్లించడమే బకాయిలు పేరుకుపోవడానికి కారణంగా తెలుస్తోంది.

ఖరీఫ్‌ సాగుపై ప్రభావం

కాలువలకు నీరు విడుదల కావడం, రుతుపవనాల ప్రభావంతో వర్షాలు మొదలవ్వడంతో జిల్లాలోని 2.05 లక్షల ఎకరాల్లో తొలకరి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. నారుమడులు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పెట్టుబడుల నిమిత్తం ధాన్యం సొమ్ముల కోసం ఎదురు చూస్తున్నారు. సకాలంలో ప్రభుత్వం నుంచి డబ్బులు పడకపోతే బయట అధిక వడ్డీలకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని వాపోతున్నారు. ధాన్యం బకాయిల విడుదలకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదించామని, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.

24 గంటల్లోనే ధాన్యం సొమ్ములంటూ కూటమి ప్రగల్భాలు

నెలరోజులైనా అందక రైతుల ఎదురుచూపులు

జిల్లాలో దాదాపు 18 వేల మంది రైతులకు రూ.290 కోట్ల మేర బకాయిలు

సొమ్ములు చెల్లించాలని కూటమి నేతలే సోషల్‌ మీడియాలో పోస్టులు

ఖరీఫ్‌ పెట్టుబడులకు సొమ్ముల్లేక రైతుల ఇక్కట్లు

అయ్యా.. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌కి విన్నపం.. ఆరు నెలలు రైతు కష్టపడి పండించిన పంట మన ప్రభుత్వం కొని నెల రోజులు గడిచినా రైతులకు డబ్బులు ఇవ్వలేదు. ఎక్కడో లోపం ఉంది. ఒక రైతు దగ్గర ధాన్యం మే 2న ప్రభుత్వం కొన్నది. ఇప్పటివరకూ డబ్బులు ఖాతాల్లో పడలేదు. మన ప్రభుత్వం ధాన్యం ఎగుమతి చేసిన 24 గంటల్లో అమౌంట్‌ పడిపోతుందని చెప్పింది.. అది జరగడం లేదు.

సోషల్‌ మీడియాలో తణుకు ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ నేత పెట్టినట్టుగా భావిస్తున్న ఈ పోస్టు జిల్లాలో రైతులకు ధాన్యం నగదు చెల్లింపులో జరుగుతున్న తీవ్ర జాప్యానికి అద్దం పడుతోంది.

అప్పులు చేయాల్సిన దుస్థితి

నాలుగు ఎకరాలు కౌలుకు వ్యవసాయం చేస్తున్నాను. ధాన్యం మే నెల 11న మిల్లుకు వెళ్లింది. సుమారు 150 బస్తాలకు రూ.2.50 లక్షలు రావాలి. ఇప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు సార్వా నారుమడులు వేయాలంటే అప్పు చేయాల్సిన దుస్థితి. రెండు రోజుల్లో ధాన్యం డబ్బులు వేస్తామని చెప్పి ఇలా మోసం చేయడం తగదు.

– రుద్రరాజు శివరామరాజు, నారినమెరక

వెంటనే డబ్బులు చెల్లించాలి

ధాన్యం తోలి నెల రోజులు కావస్తున్నా డబ్బులు బ్యాంకుకు జమ కాలేదు. నాలుగు ఎకరాలు వరి సాగు చేస్తున్నాను. నాతో పాటు ఇతర రైతులకు కలిపి సుమారు రూ.3 లక్షల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ప్రభుత్వం వెంటనే ధాన్యం డబ్బులు చెల్లించాలి. లేకుంటే చాలా ఇబ్బందులు పడతాం.

– కర్రి వెంకటేశ్వర రెడ్డి, రాయకుదురు

ధాన్యం.. రైతు దైన్యం 1
1/3

ధాన్యం.. రైతు దైన్యం

ధాన్యం.. రైతు దైన్యం 2
2/3

ధాన్యం.. రైతు దైన్యం

ధాన్యం.. రైతు దైన్యం 3
3/3

ధాన్యం.. రైతు దైన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement