
కొల్లేరు దస్త్రాలతో సిద్ధం కండి
కై కలూరు: కొల్లేరులో క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) మంగళ, బుధవారాల్లో పర్యటించనున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అన్ని దస్త్రాలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. రూట్మ్యాప్ పరిశీలన నిమిత్తం నిడమర్రు మండలం తోకలపల్లి, మండవల్లి మండలం మణుగునూరు, పులపర్రు, కై కలూరు మండలం ఆటపాక, ఆలపాడు, కొల్లేటికోట ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజుతో కలిసి సోమవారం ఆమె పర్యటించారు. కొల్లేరులో నివాసిత ప్రాంతాలు, జిరాయితీ, డీఫాం భూములు, 2006 సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఎలా అమలు చేశారనే విషయాలను కమిటీ పరిశీలిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే కామినేని మా ట్లాడుతూ కొల్లేరులో వాస్తవ పరిస్థితులను పరిశీలించి మూడు నెలల్లో నివేదిక సుప్రీంకోర్టుకు అందిస్తారన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ కొల్లేరు పరిరక్షణ, ప్రజల ఇబ్బందులను కమిటీ దృష్టికి తీసుకువెళతామన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి బి.విజయ, ఎంపీపీ అడవి కృష్ణ, వైస్ ఎంపీపీ మంగినేని రామకృష్ణ, రాష్ట్ర చేపల రైతు సంఘ అధ్యక్షుడు నంబూరి వెంకటరామరాజు (తాడినాడ బాబు) తదితరులు ఉన్నారు.
సీఈసీ పర్యటన ఇలా..
ఏలూరు(మెట్రో): కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏలూరు చేరుకుంటుంది. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 4 గంటల మధ్య కలకుర్రు, మణుగునూరు, ఆటపాక, కొల్లేటికోటను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు కొల్లేటికోటలో రైతులు, కొల్లేరువాసులతో సమావేశమవుతారు. 5 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఏలూరు చేరుకుంటారు. సా యంత్రం 6 గంటలకు ఏలూరు కలెక్టరేట్లో దెందులూరు, ఏలూరు, ఉంగుటూరు మండలాల రైతు లు, కొల్లేరువాసులు, అధికారులతో సమావేశమవుతారు. 18న ఉదయం 8 గంటల నుంచి 12.30 గంటల మధ్య నిడమర్రులో జిరాయితీ భూములను, కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం ప్రాంతాలను పరిశీలిస్తారు.
ఉంగుటూరులో కలెక్టర్ పర్యటన
ఉంగుటూరు: నియోజకవర్గంలోని కొల్లేరు పరీవాహక ప్రాంతాలను కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే ధర్మరాజు పరిశీలించారు. తోకలపల్లి, వెంకటకృష్ణాపురం, రామన్నగూడెం, నిడమర్రు, ఉంగుటూరు మండలాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు.