
వినతులు.. వేడుకోళ్లు..
కై కలూరు: అయ్యా.. మా జీవనోపాధికి గండికొట్టారు. నష్టపరిహారం చెల్లించకుండా కొల్లేరు ఆపరేషన్లో జిరాయితీ, ఢీపాం భూములలో చెరువులను ధ్వంసం చేశారు. కొల్లేరు గ్రామాల్లో చచ్చిన శవాలను పూడ్చాలన్నా.. అటవీశాఖ నిబంధనలు అడ్డువస్తున్నాయి. మా భూములు తిరిగి ఇచ్చేయండి అంటూ కొల్లేరు ప్రజలు సుప్రీంకోర్టు పంపించిన కేంద్ర సాధికార కమిటీ(సీఈసీ) ముందు గోడు వెళ్లబోసుకున్నారు. సాధికారిత కమిటీ ఏలూరు నుంచి మధ్యాహ్నం 3 గంటలకు కై కలూరు నియోజకవర్గం మణుగునూరులంక వద్దకు వచ్చారు. సమీప కొల్లేరు గ్రామాల ప్రజలు రోడ్లుపై నిలుచున్నారు. ముందుగా పెదఎడ్లగాడి నుంచి కొల్లేరు నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ప్రజలందరూ అక్కడికి వచ్చి సీఈసీ కమిటీనికి వినతిపత్రాలు అందించారు. అక్కడ నుంచి మార్గమధ్యలో కొల్లేరు ప్రాంతాలను చూస్తూ సీఈసీ కమిటీ ముందుగా సాగింది. కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు కామినేని, ధర్మరాజులతో కలసి వచ్చిన సీఈసీ వాహనాలు వీరికి తెలియకుండా కలకర్రులో కొల్లేరును పరిశీలించారు. పెద ఎడ్లగాడి వద్ద దాదాపు 30 నిమషాలు కలెక్టర్, ఎస్పీ సీఈసీ కోసం వేచి ఉన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులకు సంబంధించి 40 కార్లు ఉండటంతో ట్రాఫిక్నకు అంతరాయం కలిగింది.
ఆటపాక పక్షుల కేంద్రంలో సమావేశం
ఆటపాక పక్షుల కేంద్రం పక్షి నమూనా మ్యూజియాన్ని సీఈసీ బృందం పరిశీలించింది. అక్కడ కొంత సమయం అటవీ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. పక్షుల కేంద్రంలో నీరు లేకపోవడం, వివిధ రకాల పక్షుల గురించి అటవీశాఖ అధికారులు వివరించారు. పక్షుల కేంద్రం సమీపంలోని దెందులూరు నియోజకవర్గం కోమటిలంక ప్రజలు ఎమ్మెల్యే చింతమనేనితో కలసి సీఈసీ సభ్యులకు వినతపత్రం అందించారు. గ్రామానికి అవసరమైన రహదారిని నిర్మించాలని కోరారు. వంతన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.
వేలాదిగా ప్రజలు
కేంద్ర సాధికారిత కమిటీకి అర్థమయ్యే విధంగా ఇంగ్లీషులో ప్లకార్డులను కొల్లేరు ప్రజలు ప్రదర్శించారు. సీఈసీ రాక నేపథ్యంలో కై కలూరు, ఉండి నియోజకవర్గాల పరధిలోని కొల్లేరు గ్రామాల్లో పెద్దలు, మహిళలు, పిల్లలు వేలాదిగా తరలివచ్చారు. సేవ్ పూర్ పీపుల్ ఎడ్యుకేషన్, ప్లీజ్ సేవ్ అజ్, వుయ్ సేవ్ బర్ట్స్.. యూ సేవ్ ఫిషర్మెన్స్ వంటి నినాదాల కార్డులను ప్రదర్శించారు. ఎమ్మెల్యే కామినేని తెలుగును ఇంగ్లీషులో అనువదించి సీఈసీకి వివరించారు. సీఈసీ నుంచి వచ్చిన నలుగురు సభ్యుల్లో జి.భానుమతికి తెలుగు భాష వచ్చినప్పటికీ ఆమె ప్రసంగించలేదు. ఎంపీపీ అడవి కృష్ణ, రాష్ట్ర చేపల రైతు సంఘ అధ్యక్షుడు తాడినాడ బాబు, కొల్లేరు కమిటీ సభ్యుడు నంబూరి శివాజీరాజు, కొల్లి బాబీ, పూల రాజీ, బీకేఎం.నానీ త్రినాథరాజు, సీపీఎం నాయకులు బలరాం, రవి తదితరులు పాల్గొన్నారు.
ఆశల పల్లకీలో కొల్లేరు ప్రజలు
సీఈసీ కమిటీకి అర్జీలు
జనసంద్రమైన పందిరపల్లిగూడెం

వినతులు.. వేడుకోళ్లు..