● కాపాడిన వన్యప్రాణుల సంరక్షణ బృందం
● జూపార్కుకు తరలింపు
భీమదేవరపల్లి: మండలంలోని రాంనగర్లో ప్రమాదవశాత్తు నీళ్లు లేని వ్యవసాయ బావిలో పడిన ఓ నక్కను అటవీశాఖ అధికారులు సురక్షితంగా రక్షించారు. స్థానిక రైతు కనకం వెంకటేశ్ సోమవారం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా.. అందులో నక్క కనిపించింది. రాత్రి సమయంలో ఆహారం కోసం తిరుగుతూ అది ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటుందని గుర్తించిన రైతు, వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎల్కతుర్తి బీట్ ఆఫీసర్ సురేశ్తో పాటు వన్యప్రాణుల సంరక్షణ బృంద సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం బావిలోకి దిగి చాకచక్యంగా నక్కను సురక్షితంగా బయటకు తీశారు. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం దాన్ని ప్రత్యేక వాహనంలో హనుమకొండ జూపార్క్కు తరలించినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. సమయస్ఫూర్తితో సమాచారం అందించిన రైతును అధికారులు అభినందించారు.


