హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం రుద్రేశ్వరస్వామిని మధుర మీనాక్షి అమ్మవారిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠ అవధాని, అర్చకుడు ప్రణవ్ ఉదయం నుంచి సుప్రభాత సేవ, గణపతిపూజ, రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు.
3న జిల్లా స్థాయి సివిల్
సర్వీసెస్ టోర్నమెంట్స్
వరంగల్ స్పోర్ట్స్: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్స్ 2026–27 కోసం హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో సెప్టెంబర్ 3న జిల్లా స్థాయి సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ శుక్రవారం తెలిపారు. హనుమకొండ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులంతా పాల్గొనాలని ఆయన కోరారు. సెప్టెంబర్ 3న జేఎన్ఎస్లో ఉదయం 8 గంటలకు ఐడీ కార్డు, ప్రస్తుత సర్వీస్ సర్టిఫికెట్తో హాజరుకావాని సూచించారు. మహిళలు, పురుషులకు అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, షటిల్ బాడ్మింటన్, క్రికెట్, చెస్, క్యారమ్స్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, లాన్ టెన్నిస్, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బెస్ట్ ఫిజిక్, యోగా, ఖో–ఖో మొదలైన క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు శ్రీమన్నారాయణ అథ్లెటిక్స్ కోచ్ 94410 86556ను సంప్రదించవచ్చని సూచించారు.
వయోవృద్ధులతో
బాధ్యతగా వ్యవహరించాలి
హన్మకొండ: వయోవృద్ధులపై కుటుంబ సభ్యులు, సమాజం బాధ్యతగా వ్యవహరించి, వారికి గౌరవం, సంరక్షణ అందించాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జ్ కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి.రామలింగం అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలోని వయో వృద్ధుల డే కేర్ సెంటర్లో హనుమకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వయోవృద్ధుల హక్కులు, న్యాయపరమైన రక్షణ, సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జ్ కార్యదర్శి జి.రామలింగం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు చట్టపరంగా కల్పించిన రక్షణలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. సీనియర్ సిటిజెన్స్ ట్రిబ్యునల్ కోర్టు సభ్యురాలు డాక్టర్ కె.అనితారెడ్డి మాట్లాడుతూ వయోవృద్ధుల హక్కులు, చట్టపరమైన అంశాలు, సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉన్న వేదికల గురించి వివరించారు. హనుమకొండ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వి.నరేందర్ న్యాయ సహాయం పొందే విధానాన్ని వివరించారు. జిల్లా సంక్షేమ అధికారి ఎం.విశ్వజ ప్రభుత్వం అమలు చేస్తున్న వయోవృద్ధుల సంక్షేమ పథకాలు, సేవలు, సౌకర్యాలపై అవగాహన కల్పించారు.
డిజిటల్ విధానంపై
అవగాహన పెంచుకోవాలి
ఖిలా వరంగల్: వేర్హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలు, ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్హౌస్ రిసిప్ట్స్ (డిజిటల్) విధానాలపై అవగాహన పెంచుకోవాలని వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి సూచించారు. శుక్రవారం వరంగల్ చాంబర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. ఆధునిక వ్యవసాయ మార్కెంట్ రంగంలో డబ్ల్యూడీఆర్ఏ, ఈ–ఎన్డబ్ల్యూఆర్ రశీదుల విధానం రైతులకు, వ్యాపారులకు ఎంతో ప్రయోజనకరమన్నారు.


