● క్షేత్రస్థాయిలో పురావస్తు శాఖ ఏడీ గంగాదేవి విచారణ
● ఇనుపరాతి యుగం నాటి ఆవాసాలుగా గుర్తింపు
భీమదేవరపల్లి: మండలంలోని గట్ల నర్సింగాపూర్లో ప్రాచీన కాలం నాటి రాకాసి సమాధులు (మెగాలిథిక్ బరియల్స్) ‘సాక్షి’ దినపత్రికలో జూలై 29న ప్రచురితమైన కథనానికి పురావస్తు శాఖ స్పందించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా పురావస్తు శాఖ ఏడీ గంగాదేవి గురువారం క్షేత్రస్థాయిలో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఏడీ గంగాదేవి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో లభించిన ఆధారాల ప్రకారం ఇనుపరాతి యుగంలోనే ఆదిమ మానవులు ఇక్కడ ఆవాసాలు ఏర్పర్చుకుని జీవించి ఉంటారని తెలిపారు. స్థానిక కొండల్లోని సాధారణ బండరాళ్లతో కాకుండా, సమాధులకు ఉపయోగించిన మండే రాయి భిన్నంగా ఉండడాన్ని బట్టి కొండను తొలచి ఈ సమాధులను ప్రత్యేకంగా నిర్మించినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ సమాధులను పరిరక్షించేందుకు చుట్టూ రక్షణ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక సమర్పిస్తామని ఆమె స్పష్టం చేశారు. అదేవిధంగా ఇటీవల బ యల్పడిన వేల సంవత్సరాల నాటి కళ్యాణి చాళుక్యుల ముల్కనూరు శాసనం, గట్ల నర్సింగాపూర్ రాకాసి సమాధులు, గొల్లపల్లి సమీపంలోని కాలభైరవ విగ్రహంతో పాటు ముత్తారంలోని కాకతీయుల నాటి ప్రాచీన త్రికూటేశ్వరాలయాన్ని ఏడీ పరిశీలించారు. ఈపరిశీలనలో పురావస్తు శాఖ సిబ్బంది బాబు, గ్రామ ఉప సర్పంచ్ బొడిగే శ్రీనివాస్, కొత్త చరిత్రకారుల బృందం సభ్యులు కిషోర్ జీ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


