● కరపత్రాలతో ఉపాధ్యాయుల ప్రచారం
కాళోజీ సెంటర్: పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు ఉపాధ్యాయులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. సాధారణంగా జూన్ నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈసారి మార్చి చివరి వారం నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఏడు పీఎంశ్రీ పాఠశాలలకు
రూ.32,840 నిధులు
జిల్లాలోని ఏడు పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి సమగ్రశిక్ష అభియాన్ కింద రూ.32,840 నిధులు విడుదల చేస్తూ డీఈఓ బి.రంగయ్యనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.4,691 చొప్పున కేటాయించారు. ఈనిధులతో పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి. నాణ్యమైన బోధనకు ఫ్లెక్సీ బ్యానర్, కలర్ కరపత్రాలు ముద్రించి ప్రచారం చేస్తున్నారు. దుగ్గొండి, ఇటికాలపల్లి, నర్సంపేట (బాలికలు), కొండూరు, నరేంద్రనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఇల్లంద, నారక్కపేట ఎంపీపీఎస్లకు నిధులు కేటాయించారు.
బడిబయట ఉన్న పిల్లలను గుర్తించాలి..
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గ్రామాల్లో బడికి వెళ్లే విద్యార్థులను గుర్తించాలి. బడిబయట ఉన్న పిల్లలు, చదువు మధ్యలో ఆపేసిన వారిపై దృష్టి పెట్టాలి. అవగాహన సదస్సులు నిర్వహించి పీఎంశ్రీ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న వసతులు, నాణ్యమైన విద్య గురించి గ్రామస్తులకు వివరించాలి. కరపత్రాల పంపిణీ, ముఖ్యకూడళ్లలో ఫ్లెక్సీల ఏర్పాటు, మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలి. బాలికలు, వెనుకబడిన వర్గాల పిల్లలు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల (సీడబ్ల్యూఎస్ఎన్) నమోదు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఎంఈఓలు పర్యవేక్షించాలి..
జిల్లాలోని ఎంపిక చేసిన పీఎంశ్రీ పాఠశాలలకు నిధులు కేటాయించాం. విద్యార్థుల ప్రవేశాల కార్యక్రమాలకు మాత్రమే నిధులు వినియోగించాలి. ఖర్చులకు సంబంధించిన ఓచర్లు, వినియోగపత్రాలను (యూసీఎస్) సకాలంలో సమర్పించాలని హెచ్ఎంలను ఆదేశించాం. ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని మండల విద్యాశాఖ అధికారులకు సూచించాం
– రంగయ్యనాయుడు, డీఈఓ
నల్లబెల్లి మండలం నారక్కపేట పీఎం శ్రీపాఠశాల విద్యార్థులతో ఉపాధ్యాయుల ప్రచారం


