సీఎం సారూ.. ఇటు
చూడండి
వసతులు లేకనే..
పీయూలో జాతీయ సెమినార్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: అన్నిరంగాల్లో వెనుకబాటుకు గురైన పాలమూరు జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయాలనే సదుద్దేశంతో 2008లో అప్పటి సీఎం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలమూరు యూనివర్సిటీని ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ.. దినదినాభివృద్ధి చెందుతూ.. ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ.. వారి బంగారు భవిష్యత్కు బాటలు వేస్తోంది. ఈ క్రమంలోనే పీయూకు కేంద్ర ప్రభుత్వం ఉషా స్కీం కింద ఏకంగా రూ.100 కోట్లు ప్రకటించడంతో నేపథ్యంలో రెండు రోజుల జాతీయ సెమినార్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో సెమినార్ను పీయూలో నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానిస్తున్నామని గతంలో యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పీయూకు వచ్చే మొదటి సీఎం, ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్రెడ్డి వస్తే.. ఎంతో మేలు జరుగుతుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా అధికారులు సెమినార్ వేదికను హైదరాబాద్ శివారులోని కన్హా శాంతివనంలోకి మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఓయూకు వెళ్లిన సీఎం వసతుల అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించారని.. సొంత జిల్లాలోని పీయూకు కూడా వస్తే కనీసం రూ.200 కోట్లు అయినా కేటాయిస్తారనుకున్న వారి ఆశలు నిరాశగా మారాయి.
దక్షిణ భారతదేశంలో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తున్న మొదటి యూనివర్సిటీ పీయూ కానుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సహా రాష్ట్ర మంత్రులు, వివిధ సెంట్రల్, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు సంబంధించిన వీసీలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోపాటు పారిశ్రామికవేత్తలు, రీసెర్చ్స్కాలర్స్, ప్రొఫెసర్లు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా పలువురు విద్యార్థులు పారిశ్రామికవేత్తలు, రీసెర్చ్స్కాలర్స్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మొత్తం 15 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో వీసీ శ్రీనివాస్ ప్యాట్రన్గా, రిజిస్ట్రార్ రమేష్బాబు కన్వీనర్గా, కంట్రోలర్ ప్రవీణ, వీసీ ఓఎస్డీ మధుసూదన్రెడ్డి కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు. వీరితో పాటు బ్రోచర్ల రూపకల్పన, ఆహ్వాన పత్రాలు, అకడమిక్ సెషన్లు, ప్రతినిధుల వసతి, రవాణా, భోజనం, సాంకేతిక సమాచారం, ఆర్థిక వ్యవహారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డాక్యుమెంటేషన్ వంటి కార్యక్రమాల కోసం మొత్తం 15 మంది సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేశారు.
పాలమూరు యూనివర్సిటీ ముఖద్వారం
మొదట్లో ఇక్కడే యూనివర్సిటీలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అధికారులు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం
హాజరవుతారని వెల్లడి
అనూహ్యంగా కన్హా శాంతివనంకు మారిన సెమినార్ నిర్వహణ వేదిక
తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న
విద్యార్థి సంఘాలు, జిల్లావాసులు
పీయూ నిర్వహించే జాతీయ సెమినార్లో సీఎం రేవంత్రెడ్డి పాల్గొనున్న నేపథ్యంలో యూనివర్సిటీలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా పీయూలో విద్యార్థుల కోసం శాశ్వత ఆస్పత్రి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ముఖ్యంగా పీయూలో రెగ్యులర్ ప్రాతిపదికన టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది నియామకం చేపట్టాల్సి ఉంది. రెగ్యులర్ టీచింగ్ సిబ్బంది లేకపోవడంతో రీసెర్చిలో తక్కువ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇక పీజీ సెంటర్లలో, విద్యార్థులకు తరగతి గదులు, హాస్టళ్ల నిర్మాణం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వీటిని పరిష్కరించి పీయూలో మరిన్ని కొత్త కళాశాలలు, కొత్త కోర్సులు ప్రవేశపెట్టి జిల్లాలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కనీసం రూ.200 కోట్లు కేటాయించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పీయూ ఆధ్వర్యంలో ఆగస్టు 7, 8 తేదీల్లో హైదరాబాద్లో సమీపంలోని కన్హా శాంతివనంలో నిర్వహించే నేషనల్ సెమినార్కు సీఎం హాజరుకానున్నారు. యూనివర్సిటీలో సెమినార్ నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో హాళ్లు, అతిథులకు హోటళ్లు, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో సెమినార్ వేదికను మార్చాం. యూనివర్సిటీకి ప్రభుత్వం ఏమైనా ఇస్తే అక్కడ కూడా ప్రకటించే అవకాశం ఉంది. వేదిక మార్పులో ఎలాంటి దురుద్దేశం లేదు. – రమేష్బాబు, పీయూ రిజిస్ట్రార్


