వనపర్తి: జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ విజయవంతం చేయడానికి బూత్ లెవల్ అధికారులు, బూత్ లెవల్ ఏజెంట్లకు పకడ్బందీ శిక్షణ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి ఎస్ఐఆర్ నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. జిల్లాలోని బీఎల్వోలు, రాజకీయ పార్టీలు ఎంపిక చేసిన బీఎల్ఏలకు మండలాల వారీగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కొన్ని మండలాల్లో ఇప్పటికే పూర్తికాగా.. మిగిలిన మండలాల్లో త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. బీఎల్ఏలకు గుర్తింపు కార్డులు జారీ చేశామని, ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఇప్పటికే మండల, జిల్లాస్థాయిలో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్కుమార్, డీఆర్ఓ సూర్యప్రకాష్, ఆర్డీఓ సుబ్రమణ్యం, సి–సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


