ఖిల్లాఘనపురం: మండలంలోని సోళీపురం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి శ్రీలక్ష్మీనర్సింహ యోగానందస్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల పూలు, విద్యుద్ధీపాలతో అందంగా అలంకరించిన రథంపై స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారి నామస్మరణల నడుమ పోటాపోటీగా రథాన్ని ముందుకు లాగారు. తేరుగడ్డ వరకు తీసుకెళ్లి అక్కడ పూజలు చేసి తిరిగి ఆలయం వద్దకు తీసుకొచ్చారు. గురువారం ఉదయం ప్రత్యేక పూజలు, తీర్థావళిలో భాగంగా స్వామివారి పాదుకలను గ్రామంలో ఊరేగించారు. అనంతరం ఆలయం దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోనేరులో చక్రస్నానం నిర్వహించారు. ఆలయం దగ్గర అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ వెంకటేష్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. స్వామివారి ఉత్సవాలు గురువారంతో ముగిసినట్లు ఆలయ కమిటీ తెలిపింది.
తీర్థావళితో ముగిసిన ఉత్సవాలు


