
బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి
వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకం వంద శాతం గ్రౌండింగ్ చేసేలా బ్యాంకర్లు, సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు. ఈ పథకం కింద రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు సబ్సిడీ రుణాలు అందించి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. ఈ పథకంలో 70 నుంచి 100 శాతం వరకు ప్రభుత్వ సబ్సిడీ ఉంటుందని, మిగిలిన మొత్తం మాత్రమే బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2,495 యూనిట్లు మంజూరు కాగా 6,085 దరఖాస్తులు వచ్చాయని, ఎస్టీ కార్పొరేషన్లో 1,328 యూనిట్లకు 2,677 దరఖాస్తులు, మైనార్టీ కార్పొరేషన్లో 445 యూనిట్లకు 2,130 దరఖాస్తులు, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్లో 29 యూనిట్లకు 64 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సిన సబ్సిడీ నిధులు కేటాయించినందున యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ ఉమాదేవి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, అసిస్టెంట్ ఎల్డీఎం సాయి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.