● యూనివర్సిటీలను సైతం పాడు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం
● మాజీ ఎమ్మెల్యే శంబంగి
బొబ్బిలి: ఏయూ మాజీ వీసీ పీవీ జీడీ ప్రసాదరెడ్డిని సస్సెండ్ చేసేందుకు రాత్రికి రాత్రి ఇచ్చిన కమిటీ నివేదికను ఆసరా చేసుకో వడం దారుణమని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. పట్టణంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ పీవీ జీడీ ప్రసాదరెడ్డిని పదవీ విరమణ రోజునే సస్సెండ్ చేయడం అనేక రకాల అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆయన పదవీకాలంలో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విచారణకు ఆదేశించి ఆఘమేఘాల మీద నివేదిక తెప్పించుకుని కొత్త కమిటీ ద్వారా సస్పెండ్ చేయడం ముమ్మాటికీ రెడ్ బుక్ రాజ్యాంగ నిర్ణయమేనన్నారు. వాస్తవానికి యూనివర్సిటీ అంతర్గత విచారణ పూర్తి కాకముందు విజిలెన్స్ విచారణకు ఆదేశించడం, వెంటనే నివేదిక తెప్పించుకోవడం సస్సెండ్ చేయడం చకచకా జరిగిపోయాయన్నారు. ఇన్నాళ్లుగా యూనివర్సిటీలో అంతా బాగుండి, ఆయన పదవీ విరమణ రోజే చంద్రబాబుకు అక్రమాలు గుర్తొచ్చాయా అని శంబంగి ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ఇప్పుడు యూనిర్సిటీల్లోనూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి చంద్రబాబు హయాంలో జరిగినన్ని అక్రమాలు, అధర్మాలు ఎక్కడా జరగలేదన్నారు. రాత్రి వేళల్లో చీకటి జీఓలు విడుదల చేయడం చంద్రబాబుకు అలవాటైనా మరీ ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అన్యాయమన్నారు. మరో పక్క పత్రికా ఎడిటర్లపైనా కేసులు నమోదు చేసేందుకు జీఓలు విడుదల చేయడం దేశంలో ఎక్కడా తాను చూడలేదన్నారు. ఇటువంటి చీకటి జీఓలు విడుదల చేయడం మానుకుని ఉన్న మూడేళ్ల కాలం ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలించాలని చంద్రబాబుకు హితవు పలికారు.
రైతు సేవా కేంద్రంలో చోరీ
బొబ్బిలి రూరల్: మండలంలోని సిహెచ్.బొడ్డవలస గ్రామ రైతు సేవా కేంద్రలో శుక్రవారం రాత్రి దొంగలు పడి విలువైన వస్తువులు దొంగిలించుకుపోయారు. ఈ మేరకు హార్టీకల్చర్ అసిస్టెంటుగా పని చేస్తున్న ఆరికతోట నాగభూషణం శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి పది గంటల వరకు తాను విధుల్లోనే ఉన్నానని, అప్పుడే తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆర్ఎస్కే తాళాలు పగిలి ఉన్నాయని లోపలికి వెళ్లి చూస్తే కంప్యూటర్, ప్రింటర్, టీవీ కనిపించలేదని దొంగలు వాటిని పట్టుకుపోయారని సుమారు రూ.లక్షన్నర విలువుంటుందని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు,
రాజాం ఏరియా ఆస్పత్రిలో మరిన్ని రక్త పరీక్షలు
రాజాం: రాజాంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జిల్లా లేబొరేటరీ ఏర్పాటు చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దామోదర ప్రధాన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపా రు. ఈల్యాబ్లో డెంగ్యూ, స్క్రబ్ టైపస్, చికున్గున్యా, లెప్టోస్ఫిరిసోసిస్ వంటి వ్యాధులకు రక్త పరీక్షలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. రాజాంతో పాటు చుట్టు పక్కల ప్రజలు, ఆస్పత్రులు ఈ వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు.


